నిత్యవసర సరుకుల ధరలు సామాన్యుడికి దడ పుట్టిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యావసర సరుకుల ధరల నియంత్రణ చేయటంలో విఫలమయ్యాయని ప్రజలు వాపోతున్నారు. నిన్న మొన్నటి వరకు 135 రూపాయలు ఉన్న కిలో వంట నూనె 200 రూపాయలకు చేరుకుంది.
రష్యా – ఉక్రెయిన్ యుద్ధాన్ని కారణంగా చూపుతూ వ్యాపారులు అమాంతంగా ధరలు పెంచడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. కరోనా కల్లోలం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ప్రజలకు.. పెరుగుతున్న ధరలు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. మండుతున్న ధరలతో సామాన్యుడు సరుకులను కొనలేని పరిస్థితి నెలకొంది.
ఉక్రెయిన్- రష్యా మధ్య జరుగుతున్న యుద్ధమే ధరలు పెరుగుదలకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు. ఉక్రెయిన్ నుంచి పెద్ద ఎత్తున భారత్ పామాయిల్ దిగుమతి చేసుకుంటుంది. సరఫరా ఆగిపోవడంతో ధరలు అమాంతంగా పెరిగాయి. నిన్నమొన్నటి వరకు ధర 135 రూపాయలు ఉన్న లీటరు నూనె… ఇప్పుడు 200 రూపాయలకు చేరింది. అయితే పాత స్టాకునే అధిక ధరలకు విక్రయిస్తుండడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
భారీగా పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు
నూనె లేనిదే ఏ వంట చేయలేమని గత్యంతరం లేక ధర పెరిగినా కొనాల్సి వస్తుందని ప్రజలు వాపోతున్నారు. నూనెలు దిగుమతి ఆగిపోవడం తో ధరలు పెంచడం సబబే కానీ ఇతర సరుకులు ధరలను కూడా భారీగా పెంచేశారని ప్రజలు మండిపడుతున్నారు. అసలే పనులు లేక ఆదాయం లేక విలవిలలాడుతున్నామని వారు అంటున్నారు.
పేదవానికి గంజినీళ్లే దిక్కు
పేదవానికి గంజినీళ్లే దిక్కని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పదిహేను రోజులుగా నిత్యావర సరుకుల ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఉక్రెయిన్ రష్యా యుద్ధం కారణం చూపి వ్యాపారులు చేస్తున్న దోపిడీకి చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమై పెరుగుతున్న ధరలను అదుపు చేయాలని పలువురు కోరుతున్నారు.
సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి