కేంద్ర ఎన్నికల సంఘం ప్రారంభించిన చర్యల్లో భాగంగా మంగళవారం దేశవ్యాప్తంగా 86 పార్టీలను జాబితా నుంచి తొలగించింది. అలాగే ఉనికిలోలేని 253 పార్టీలను క్రియారహిత నమోదిత గుర్తింపులేని రాజకీయ పార్టీ (ఆర్యూపీపీ) లుగా ప్రకటించడంతో ఇప్పటివరకు ఉనికిలోలేని పార్టీల సంఖ్య 537కి చేరింది. ఎన్నికల సంఘం జాబితా నుంచి తొలగించిన ఆర్యూపీపీల సంఖ్య 284కు చేరింది.
ఏపీలో ఈసీఐ జాబితా నుంచి తొలగించిన పార్టీల విషయానికి వస్తే ఆలిండియా ముత్తాహిదా ఖ్వామీ మహాజ్, భారత్దేశం పార్టీ, ఇండియన్స్ ఫ్రంట్, జాతీయ తెలుగు అభివృద్ధి సేవాసమూహం, మన పార్టీ, ప్రజాభారత్ పార్టీలు ఉన్నాయి. మరోవైపు ప్రజాశాంతి పార్టీ కి కూడా ఈసీ ట్విస్ట్ ఇచ్చింది.
క్రియాశీలకంగా లేని పార్టీల జాబితాలో ప్రజాశాంతి పార్టీని చేర్చింది. యాక్టివ్గా లేని పార్టీలకు కామన్ సింబల్ నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఆరు, తెలంగాణలో రెండు నమోదిత గుర్తింపులేని రాజకీయ పార్టీ (ఆర్యూపీపీ)లను ఈసీఐ జాబితా నుంచి తొలగించింది.
ఈ జాబితాలో నవతరంపార్టీ లేదని అయితే ఇలా కేంద్ర ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలకు ఝలక్ ఇవ్వడం అన్యాయమని నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం అభిప్రాయపడ్డారు. డబ్బులు పంచే పార్టీలను వదిలి ప్రజలకోసం పోరాడే రిజిస్టర్ద్ రాజకీయ పార్టీల రద్దు అన్యాయమని ఆయన అన్నారు.
ఎన్నికల కమిషన్ నిబంధనలు నవతరంపార్టీ ఖచ్చితంగా పాటిస్తుందని అందువల్ల నవతరంపార్టీ కి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని అన్నారు. అయితే ఎన్నికల్లో డబ్బులు పంపిణీ చేసిన పార్టీలను వదిలి కనీసం నిబంధనలు ప్రకారం ఎన్నికల్లో డబ్బులు ఖర్చు చేయలేని పార్టీలను రద్దు చేయడం అన్యాయం అన్నారు.
కరోనా వల్ల అకౌంట్లు ఇవ్వలేదని, అటువంటి పార్టీలకు కనీసం ఆరు నెలల గడువు ఇవ్వాలని కోరారు. అడ్రస్ లేని పార్టీలు, ఎన్నికల్లో పోటీ చేయని పార్టీలపై చర్యలకు తాము వ్యతిరేకం కాదని, చిన్న పార్టీల ఆర్థిక పరిస్థితి దృష్టిలో పెట్టుకొని ఆరు నెలల సమయం ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు నవతరంపార్టీ నుండి విజ్ఞప్తి చేస్తున్నామని రావు సుబ్రహ్మణ్యం తెలిపారు. రాష్ట్రపతి ఎన్నికల్లో పార్లమెంట్ సభ్యులు ప్రతిపాదకులు గా వుండే నిబంధనలు తొలగించాలని ఎన్నికల కమిషన్ కు విజ్ఞప్తి చేశారు.