కొల్లాపూర్ కోట ముందు భాగాన్ని తనకు రెండు కోట్ల రూపాయలకు అమ్మాలని అడిగిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట కాదన్నందుకే కోటలో ప్లాట్లు వేసేందుకు అడ్డుపడుతున్నాడని కొల్లాపూర్ రాజా ఆదిత్య లక్ష్మణరావు చేసిన ఆరోపణలకు తీవ్ర నిరసన వ్యక్తం చేసిన జూపల్లి నేడు రామాలయం లో బైఠాయించారు. రాజా ఆదిత్య లక్ష్మణరావు తన ఆరోపణలకు కట్టుబడి ఉంటే తక్షణమే రామాలయానికి వచ్చి దేవుడి ఎదుట ప్రమాణం చేయాలని ఆయన సవాల్ విసిరిన విషయం తెలిసిందే. కొల్లాపూర్ అంటేనే గుర్తుకు వచ్చేది కోట. అలాంటి కోటను ప్రజా అవసరాల కోసం గత 70 సంవత్సరాలుగా వినియోగిస్తున్నారు. బతుకమ్మ తదితర పండుగలన్నీ కొల్లాపూర్ కోటలోనే జరుపుకుంటున్నాము. అలాంటిది రాజాగారు దాన్ని ప్లాట్లు చేసి అమ్ముకోవాలని చూస్తున్నారు. ప్లాట్లు చేసి అమ్ముకుంటే కొల్లాపూర్ కోట చుట్టూ నిర్మాణాలు వచ్చి కనిపించకుండా పోతుంది. గతంలో కోటకు సంబంధించిన బహిరంగ స్థలాన్ని వేరేవారు ఆక్రమించుకుంటుంటే దాన్ని కాపాడామని జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. ప్రజల అవసరాల కోసం ఉపయోగిస్తున్న స్థలాన్ని సొంత ప్రయోజనాలకు వాడుకుంటానంటే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు.
previous post