మంత్రి కేటీఆర్ తనను వ్యక్తిగతంగా వేధిస్తున్నారని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ వాపోయారు. నేడు ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యేగా తనకు రావాల్సిన పెన్షన్ ను నిలిపివేశారని, తన గన్ మెన్ లను తొలగించారని ఆయన అన్నారు. చివరికి తాను ఉండే ఇంటి నుంచి కూడా పంపించేశారని సంపత్ కుమార్ అన్నారు.
తన అన్నను పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా తొలగించారని తన తమ్ముడికి న్యాయపరంగా వచ్చిన మున్సిపాలిటీ కాంట్రాక్టును రద్దు చేయించారని సంపత్ కుమార్ అన్నారు. తన పైన కక్ష సాధింపు ధోరణితో పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారని ఆయన విమర్శించారు.
ఇలాంటి చర్యల కన్నా పౌరుషం ఉంటే తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని కేటీఆర్ కు సవాల్ విసిరారు. ఐకియా ఇచ్చిన అనుమతులలో క్విడ్ ప్రో కో జరిగిందని ఆయన ఆరోపించారు. హెరిటేజ్ భవనాన్ని తొలగించి వారికి ఇచ్చి వందల కోట్లు ముడుపులు తీసకున్నారని ఆయన ఆరోపించారు. అయినా తాను టిఆర్ఎస్ ప్రభుత్వ విధానాలపై పోరాడుతూనే ఉంటానని ఎట్టి పరిస్థితుల్లో పోరాటం ఆపేది లేదని ఆయన అన్నారు.