శ్రీకాకుళం జిల్లా మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ ధనలక్ష్మీ కుమారుడు అవినాష్ ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించాడు. అవినాష్ ఎస్.ఎం.పురం సర్పంచ్ పని చేసేవాడు. అతను కొనుగోలు చేసిన భూమిలో శివాలయం నిర్మాణం చేపట్టాడు.
ఆలయ ధర్మకర్తగా అతను చేసిన ఈ పనిని రాష్ట్రంలో వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అడ్డుకున్నది. అవినాష్ను ఆలయ ప్రాంగణంలోకి వెళ్లనీయకుండా పోలీసులు అదుపు చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా అవినాష్ పోలీసుల వద్ద ఎంత మొరపెట్టుకున్నా ఎచ్చెర్ల పోలీస్స్టేషన్ ఎస్ఐ, సిఐ లు వినలేదు.
పోలీసులు తమ ధోరణి మార్చుకోకుండా అధికార పార్టీ వారికి వత్తాసు పలుకుతున్నారు. దాంతో అతను ఈరోజు ఉదయం ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్లో ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడే ముందు అవినాష్ ఓ సెల్ఫీ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసి తదుపరి ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్ మూడవ అంతస్థు నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
అధికార పార్టీ వర్గీయులు అవినాష్ ను పోలీసుల ద్వారా వేధింపులకు గురిచేస్తున్నట్లు మాజీ చైర్పర్సన్ చౌదరి ధనలక్ష్మీ, టిడిపి మాజీ అధ్యక్షులు చౌదరి బాబ్జి ఆవేదన వ్యక్తం చేశారు. అవినాష్ మూడవ అంతస్థు నుంచి దూకేందుకు సిద్ధంగా ఉన్నప్పుడు అక్కడే ఉన్న సహచరులు ఎంత ప్రయత్నించినా అవినాష్ వినలేదు. పైనుంచి దూకేయడంతో వెంటనే అక్కడే ఉన్న సహచరులు హుటాహుటిన శ్రీకాకుళం కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఇది తెలిసిన తెలుగుదేశం పార్టీ మాజీ విప్ కూన రవికుమార్, మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ, కిమ్స్ ఆసుపత్రికి వచ్చి పరామర్శించారు. మాజీ విప్ కూన రవికుమార్ మాట్లాడుతూ అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్న పోలీసులపై జిల్లా ఎస్పీ వెంటనే చర్యలు చేపట్టాలని వారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.