తెలంగాణ రాష్ట్ర 6వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శాసనసభ ఆవరణలో జాతీయ జెండాను రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి ఆవిష్కరించారు. మొదటగా శాసనసభ ఆవరణలోని జాతిపిత మహాత్మాగాంధీ, రాజ్యాంగ నిర్మాత డా. బిఆర్ అంబేడ్కర్ విగ్రహాలకు పుష్పాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ దశాబ్దాల పోరాటం, అమరవీరుల బలిదానాలు, కేసీఆర్ మడమతిప్పని పోరాట ఫలితమే కోట్లాది మంది తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర కలను నెరవేరడానికి కారణమని అన్నారు. దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవం ఎలానో తెలంగాణ ప్రజలకు జూన్ 2 ఆవిర్భావ దినోత్సవం అలాంటిదేనని ఆయన అన్నారు.
రాష్ట్ర సాధన ఎంత ముఖ్యమో, రాష్ట్ర అభివృద్ధి కూడా అంతే ముఖ్యమని, ఈ విషయంలో తెలంగాణ ప్రజలు కోరుకున్న దానికంటే ఎక్కువ అభివృద్ది, సంక్షేమ పథకాలను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ అమలు చేస్తున్నారని స్పీకర్ అన్నారు. ముఖ్యంగా వ్యవసాయ రంగం అభివృద్ధి, రైతు సంక్షేమం కోసం దేశంలోనే ఏ రాష్ట్రం చేపట్టని పథకాలను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్నారని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, పలువురు MLC లు, శాసనసభ కార్యదర్శి డా వి. నరసింహా చార్యులు పాల్గొన్నారు.