పవిత్రమైన తిరుపతి నగరంతో పాటు పరిసర ప్రాంతాలలో భూముల ధరలు పెరగడంతో ప్రభుత్వ రెవెన్యూ, దేవాదాయ శాఖ భూములతో పాటు ప్రైవేటు వ్యక్తులు కొనుగోలు చేసిన భూములను అంగ బలంతో ఆక్రమిస్తున్న భూ కబ్జాదారులను ఉక్కుపాదంతో అణిచి వేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి అన్నారు.
తిరుపతి నగరంలో కొంతమంది అవినీతి పోలీస్, రెవెన్యూ అధికారుల కారణంగా ప్రభుత్వ ప్రతిష్ట మసకబారుతోందని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దల అండదండలు ఉన్న వారు ధీమాతో భూకబ్జాదారులు వెచ్చల విడిగా వ్యవహరిస్తున్నారని ఆయన తెలిపారు.
కొంత మంది అవినీతి అధికారులు పెంచి పోషించడం పై రాష్ట్ర ముఖ్యమంత్రి నిఘా వర్గాల ద్వారా సమాచారం తెప్పించుకొని శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.