గోవింద కోటి రాసిన 25 ఏళ్ల లోపు యువత కుటుంబానికి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ పాలకమండలి సమావేశం తిరుమలలో జరిగింది. ఈ సమావేశం నిర్ణయాలను టీటీడీ చైర్మెన్ భూమన కరుణాకర్ రెడ్డి మీడియాకు వివరించారు.
రామకోటి తరహాలోనే గోవింద కోటి రాసేలా ప్రోత్సహించనున్నామన్నారు. యువతలో భక్తి భావం పెంపొందించేందుకు ఈ కార్యక్రమం దోహదపడనుందని ఆయన అభిప్రాయపడ్డారు.ఎల్కేజీ నుండి పీజీ వరకు 20 పేజీలతో భగవద్గీత పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.రూ. 33 కోట్లతో వడమాలపేటలో ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టుగా ఆయన ప్రకటించారు.
రూ. 300 కోట్లతో వసతి భవన నిర్మాణం చేపట్టనున్నట్టుగా టీటీడీ చైర్మెన్ తెలిపారు.అలిపిరి నడక మార్గంలో ఆంక్షలు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు.రేపటి నుండి భక్తులకు చేతికర్రలను అందిస్తామన్నారు. రూ. 2 కోట్ల వ్యయంతో చంద్రగిరి మూలస్థాన ఆలయాన్ని పునర్నిర్మిస్తామన్నారు.
టీటీడీ పోటులో 413 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.రూ. 2.46 కోట్లతో టీటీడీ ఆసుపత్రులకు మందులను కొనుగోలు చేయాలని పాలకవర్గం నిర్ణయించిందన్నారు.
టీటీడీ ఆధ్వర్యంలో నడిచే వేద పాఠశాలలో 47 అధ్యాపక పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించినట్టుగా ఆయన తెలిపారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఈ నెల 18న శ్రీవారికి సీఎం జగన్ పట్టు వస్త్రాలు సమర్పించనున్నట్టుగా ఆయన చెప్పారు.