కష్టపడి చదువుకుంటే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని ఎంతోమంది నిరూపిస్తుంటారు. అలాంటి కోవకు చెందిన వారే తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వేమగిరి కి చెందిన చుక్కల సూర్య కుమార్. ప్రాథమిక విద్య నుంచి మెరుగైన ఫలితాలు సాధిస్తూ వచ్చిన ఈ విద్యార్థి తాజాగా విడుదలైన గ్రూప్ 1 పరీక్షా ఫలితాల్లో ఈ ప్రతిభ కనబరిచారు. జైలు శాఖలో డిఎస్పిగా ఎంపికయ్యారు.
పదవతరగతి వరకూ కడియం షిర్డీ సాయి స్కూల్లో చదివి నూజివీడులో త్రిబుల్ ఐటీలో సీటు సాధించారు. అక్కడ ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్న సూర్య కుమార్ అనంతరం ఇన్ఫోసిస్ కంపెనీ బెంగళూరులో రెండేళ్ల పాటు సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేశారు. అయితే గ్రూప్స్ లో సత్తా చాటాలనే తన లక్ష్యం కోసం ప్రయత్నిస్తూ వచ్చారు.
గత నెలలో దేవాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం ఆ ఉద్యోగానికి సంబంధించి ట్రైనింగ్ పొందుతుండగా ఈ గ్రూపు-1 పరీక్షా ఫలితాలలో డి.ఎస్.పి గా ఎంపిక అయ్యారు.సూర్య కుమార్ తండ్రి వెంకట రమణ కడియం పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు.తల్లి లక్ష్మీ గృహిణి కాగా సోదరుడు గోవిందరాజు డాక్టర్ చదివి ప్రస్తుతం ఢిల్లీ ఎయిమ్స్ లో గ్యాస్ట్రో ఎంట్రాలజీ సంబంధించి కోర్సు చేస్తున్నారు.గ్రూప్1 కు ఎంపికైన సూర్య కుమార్ ను పలువురు అభినందించారు.