ప్రతిభ ఏ ఒక్కరి సొత్తు కాదని శ్రమిస్తే విజయం వారి సొంతమవుతుందని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆదివారం భారత మాజీ రాష్ట్రపతి దివంగత డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా వనపర్తి పట్టణంలో ఒక బాంకెట్ హాల్ లో ఏర్పాటుచేసిన ఉత్తమ ఉపాధ్యాయులు అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష, జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి పాల్గొని జ్యోతిని వెలిగించి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రాధాకృష్ణన్ ను ఆదర్శంగా తీసుకొని ఎదగాలని అన్నారు. నవ సమాజ నిర్మాణం కోసం విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దడం లో ఉపాధ్యాయులు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని అన్నారు. అందు కోసం ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసి వారికి అవార్డులు ఇవ్వడం జరుగుతుందని అన్నారు.
ఈ అవార్డుల ప్రదానం తో వారికి మరింత బాధ్యత పెరుగుతుందని మంత్రి తెలిపారు. జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష మాట్లాడుతూ గత ఏడాది కరోనా వల్ల ఉత్సవాలు లేక పోయామని ఈ సారి కోవిడ్ నిబంధనలతో ఉత్సవాలు జరపడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు కరోనా అనేక పాఠాలు నేర్పింది అని, టెక్నాలజీ పెరిగినా విద్యార్థులకు ప్రత్యక్షంగా బోధిస్తే తప్ప వారికి అవగాహన కలగదని అన్నారు.
ప్రస్తుతం విద్యా సంస్థలు తెరిచారని ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలకు లోబడి పాఠశాలలు నడపాలని అన్నారు. 18 ఏళ్లు పైబడిన వారు వ్యాక్సిన్ వేయించుకోవాలి అని సూచించారు. ఈ సందర్భంగా ఎంపికైన 23 మంది ఉత్తమ ఉపాధ్యాయులను మంత్రి, జిల్లా కలెక్టర్ షేక్ యాష్మీన్ భాష, జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి చేతుల మీదుగా ఉపాద్యాయులను ఘనంగా సన్మానం చేశారు.
పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్