జగనన్న వదిలిన బాణం అయిన వై ఎస్ షర్మిలారెడ్డి తెలంగాణలో పార్టీ ప్రారంభించడానికి శ్రీకారం చుట్టిన రోజునే తమిళనాడులో కూడా మరో మహిళానేత క్రియాశీలక రాజకీయాలలో అడుగుపెట్టారు.
తమిళనాడులో సంచలనం సృష్టిస్తున్న శశికళ యాదృచ్చికంగా నేడే రాజకీయాల్లో పునరాగమని చేశారు. శశికళ తనను తాను జయలలిత వదిలన బాణంగా చెప్పుకునేవారు. ఇటు జగనన్న వదిలిన బాణం, అటు జయమ్మ వదిలిన బాణం రంగంలో దిగడంలో తెలంగాణ, తమిళనాడులో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.
రెండు చోట్లా అధికార పార్టీలలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అన్నాడీఎంకేను ఆధీనంలోకి తెచ్చుకుంటానని, తననెవరూ అడ్డుకోలేరని అన్నాడీఎంకే బహిష్కృతనేత శశికళ నేడు అన్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలు శిక్ష అనుభవించి గత నెల 27న విడుదలై బెంగళూరు శివార్లలోని రిసార్టులో రెస్ట్ తీసుకున్న శశికళ సోమవారం అర్ధరాత్రి చెన్నైకి చేరుకున్నారు.
కృష్ణగిరి జిల్లా కందికుప్పంతోపాటూ పలు చోట్ల ఆమె కారులో నుంచే ప్రసంగించారు. ‘అణగదొక్కాలనే వారి ప్రయత్నాలు ఫలించవు. క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తా. త్వరలో మీడియా ముందుకు వచ్చి అన్ని విషయాలు వివరిస్తా అంటూ శశికళ వ్యాఖ్యానించారు.
మరో వైపు తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానని షర్మిలారెడ్డి ప్రకటించి ఇక్కడ సంచలనం సృష్టించారు. నల్గొండ జిల్లాకు చెందిన కొందరు వైఎస్ అభిమానులతో వై ఎస్ షర్మిల నేడు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
ఈ సమ్మేళనం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుడూ నల్గొండ జిల్లాతో పాటు ప్రతీ జిల్లా నేతలను కలుస్తానని ఆమె అన్నారు. తెలంగాణాలో రాజన్న రాజ్యం లేదని ఎందుకు లేదన్నది నా ప్రధాన ఆలోచన అని, అందుకే నేడు నల్గొండ జిల్లా నేతలతో మాట్లాడుతున్నానని అన్నారు.
తెలంగాణాలో రాజన్న రాజ్యం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానన్న ఆమె కచ్చితంగా తీసుకొస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. వైఎస్ లేని లోటు తెలంగాణాలో కనపడుతుందని అందుకే క్షేత్ర స్థాయి పరిస్థితుల గురించి ఆలోచిస్తున్నానని ఆమె అన్నారు.
ఇద్దరు మహిళల రాజకీయ రంగ ప్రవేశం ఎవరిని ముంచుతుందో ఎవరిని తేలుస్తుందో వేచి చూడాలి.