వాయవ్య బంగాళాఖాతంలో కొనసాగుతోన్న ఆవర్తనం అల్పపీడనంగా మారి రెండు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురువనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు.. మిగతా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని పేర్కొంది.
కరీంనగర్, రాజన్న-సిరిసిల్ల, జయశంకర్-భూపాలపల్లి, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, పెద్దపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, భద్రాద్రి-కొత్తగూడెం, కుమ్రం భీం-ఆసిఫాబాద్, మంచిర్యాల్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వానలు పడే అవకాశాలున్నాయని హెచ్చరించింది. ఈ మేరకు వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాలు, ఇతర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలకు అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. జులైలో 23శాతం అధిక వర్షపాతం నమోదు కాగా.. ఆగస్టులో మాత్రం 82శాతం వర్షపాతం లోటు ఉన్నట్లు వాతావరణశాఖ చెబుతోంది. ఆగస్టులో ఇప్పటి వరకు 21.2 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది.జులైలో భారీ వర్షాలు తెలంగాణను ముంచెత్తాయి.
కానీ ఆగస్టులో మాత్రం తేలికపాటి వానలు తప్ప ఎక్కడా ఆశించిన స్థాయిలో వర్షాలు లేవు. దీంతో రైతులు ఆందోళనలో ఉన్నారు. తొలకరి తర్వాత వ్యవసాయ పనులు మొదలు పెడితే.. ఆ తర్వాత వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ నెలలో లోటు వర్షపాతం కనిపిస్తోంది. ఈ రెండు వారాల్లోనైనా వానలు ఊపందుకుంటాయని ఆశతో ఉన్నారు. భారీ వర్షాలు కురిస్తే..
ఆస్తి, ప్రాణ, నష్టం జరగకుండా ఉండేందుకు అధికారులు ముందు చూపుతో వ్యవహరించేలా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంత కుమారి అధికారులను అలర్ట్ చేశారు. ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్లలో భారీ వర్షాలు కురిసే ఆవకాశం ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో సీఎస్ ఆయా జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేశారు. జిల్లా కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసి మానిటర్ చేయాలని ఆమె కలెక్టర్లకు ఆదేశించారు.