విజయనగరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి కల్యాణ్ చక్రవర్తి వెల్లడి
ఏపీ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సి. ప్రవీణ్ కుమార్, జస్టిస్ సీహెచ్. మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ చీమలపాటి రవి, తల్లాడ రాజశేఖర్ లు ప్రత్యేక పర్యటన నిమిత్తం విజయనగరం జిల్లాకు వస్తున్నారు. ఈ నెల 27వ స్థానిక కోర్టు ప్రాంగణంలో ఆ రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి కల్యాణ్ చక్రవర్తి తెలిపారు.
ఇటీవల స్వర్గస్తులైన బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, సీనియర్ అడ్వకేట్ గేదెల రామ్మోహన్ రావు చిత్రపటాన్ని కోర్టు హాలులో న్యాయమూర్తుల చేతుల మీదుగా ఆవిష్కరిస్తారన్నారు. అనంతరం ఇటీవల హైకోర్టు న్యాయమూర్తులుగా నియమితులైన వారికి సీనియర్ న్యాయమూర్తుల చేతుల మీదుగా సత్కార కార్యక్రమం కూడా ఉంటుందన్నారు. అలాగే జిల్లా కోర్టుకు మరో నూతన భవనం కోరుతూ ప్రతిపాదనలు పంపించిన నేపథ్యంలో పాత భవనాల పరిస్థితిని న్యాయమూర్తుల బృందం పరిశీలిస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వివరించారు.