కొమరంబీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్ నియోజకవర్గంలోని దహేగం మండల చిన్న అయినం గ్రామస్తులు కొద్ది రోజులుగా తాగునీరు రాక ఇబ్బందులు అవుతున్నారు. ఈ విషయాన్ని సిర్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రావి శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే స్పందించి స్థానిక ఎంపీడీవో కార్యాలయం ముందు గ్రామస్తులతో కలిసి బిందెలతో నిరసన తెలిపారు.
సమస్యను ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లి 2 రోజుల్లో పూర్తిగా పరిష్కరిస్తామని సూపరింటెండెంట్, RWS అసిస్టెంట్ ఇంజనీర్ హామీ ఇచ్చారు. తక్షణమే వాటర్ ట్యాంకులు పంపించేందుకు కూడా ఏర్పాట్లు చేయడంతో నిరసనను విరమించుకున్నారు.
ఈ సందర్భంగా రావి శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణను బంగారు తెలంగాణ చేశామంటూ లక్షల ఖర్చు చేసి దశబ్ది ఉత్సవాలు జరుపుతున్నారు కానీ ఈ ప్రభుత్వంకు, స్థానిక ఎమ్మెల్యే కోనేరు కోనప్పకి ఈ ప్రజల సమస్యలు కనబడటం లేదని అన్నారు.
2 రోజుల్లో సమస్య పరిష్కరించకపోతే గ్రామస్తులతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బిందెలతో కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు ఎలక మోహన్, తొగేష్, శ్రీనివాస్, సోషల్ మీడియా మండల కన్వీనర్ కొసరి ఆంజనేయులు కార్యకర్తలు పాల్గొన్నారు.