కేరళలో కరోనా వ్యాప్తికి దోహదం చేసే చర్యలకు పాల్పడిన ఒక విద్యావంతుడైన మూర్ఖుడి విషయం వెలుగు చూసింది. ఇతను ఎవరో సాధారణ వ్యక్తి కూడా కాదు. ఒక ఐఏఎస్ అధికారి. అనుపమ్ మిశ్రా అనే ఇతను దక్షిణ కేరళలోని కొల్లం జిల్లా సబ్ కలెక్టర్ గా పని చేస్తున్నాడు.
మార్చి 18 తను సింగపూర్ పర్యటన నుంచి తిరిగి వచ్చాడు. వచ్చీ రాగానే వైద్యాధికారులు ఇతన్నికలిసి 14 రోజుల పాటు ఐసోలేషన్ లో ఉండాలని సూచించారు. నిన్న ఆరోగ్య శాఖ కార్యకర్త ఒకరు అనుపమ్ మిశ్రా నివాసానికి వెళ్లి చూడగా అతను అక్కడ లేడు.
ఇదే విషయాన్ని ఆరోగ్య శాఖ కార్యకర్త తన పై అధికారులకు ఫిర్యాదు చేశాడు. దాంతో అతను ఎక్కడ ఉన్నది తెలుసుకునే పనిలో పోలీసులు శాఖ ఉన్నతాధికారులు నిమగ్నమయ్యారు. అతడిని పోలీసులు ఫోన్ పై సంప్రదించగా బెంగళూరులో తన సోదరుడు ఉన్నాడని, అతను డాక్టర్ కాబట్టి అతని పర్యవేక్షణలో ఉండేందుకు బెంగళూరు వచ్చానని తెలిపారు.
అయితే పోలీసులు అంతటితో వదల్లేదు. అతను చెప్పింది నిజమా కాదా అని తెలుసుకోవడానికి అతని టెలిఫోన్ సిగ్నల్స్ ను ట్రాక్ చేశారు. దీంతో అతను ఎక్కడ ఉన్నదీ బయటపడింది.
అతను తన సొంత ఊరైన కాన్పూర్ కు వెళ్లాడు. దాంతో కొల్లం జిల్లా కలెక్టర్ బి.అబ్దుల్ నాసర్ ఇతనిపై భారత ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. తక్షణమే అతని పై చర్యలు తీసుకోవాలని కోరారు. క్వారాంటైన్ నిబంధనలను ఉలంఘించినందుకు అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేయబోతున్నారు.
అదే విధంగా ఉన్నతాధికారులకు చెప్పి అనుమతి తీసుకోకుండా రాష్ట్రం వదిలి పెట్టి వెళ్లినందుకు అతనిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు.