ఒకరు అప్పలస్వామి ,మరొకరు గణేష్… వీళ్లద్దరిని. వాళ్లల్లో వాళ్లని పరిచయం చేసింది… జైలు.ఆ పరిచయం కాస్త.. పెరిగి.. పెరిగి.. పేద్ద దొంగతనానికి స్కెచ్ వేయబడింది. సీన్ కట్ చేస్తే ఆ ఇద్దరూ విజయనగరం ట్యాంక్ బండ్ దిగువన సెంట్రల్ క్రైమ్ స్టేషన్ కు అడ్డంగా దొరికిపోయారు.
ఈ కేసు వివరాలను జిల్లా ఎస్పీ ఆదేశాలతో అటు సీసీఎస్ ,ఇటు వన్ టౌన్ పీఎస్ ల సీఐలు కాంతారావు, డా.వెంకటరావు లు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ లో వెల్లడించారు.కేసు వివరాల్లోకి వెళితే.. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం జరజాపేటకు చెందిన అప్పలస్వామి, విశాఖ ఏవీఎన్ కాలేజ్ కు చెందిన గణేష్ లు పాత నేరస్థులతో జైలులో పరిచయం అయి…విడుదల అయ్యిన వెంటనే భోగీ పండగ ముందు రోజే విజయనగరం అలకానంద కాలనీలో తాళం వేసిన ఇంటిని ఎంచుకుని…మొత్తం 12 తులాల బంగారాన్ని అపహరించారు.
ఈ మేరకు ఊరి నుంచీ వచ్చిన ఇంటి యజమాని ఫిర్యాదు తో వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా…. సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులకు ఈ ఇద్దరు ముద్దాయి లు పట్టుబడ్డారు.తమ స్టైల్ లో విచారిస్తే…దొంగ తనం చేసినట్లు ఒప్పుకున్నారని…సీసీఎస్ సీఐ కాంతారావు చెప్పారు.
ఈ మీడియా సమావేశంలో ఏఎస్ఐ గౌరీశంకర్, హెచ్సీలు శంకర్రావు, శ్రీనివాసరావు, సత్యం, పైడి రాజులు పాల్గొన్నారు. కాగా.. ఈ కేసులో ప్రధానంగా నిందితులను పట్టుకున్నది మాత్రం.. సీసీఎస్ హెచ్ సీ మహ్మద్ ఇమ్రాన్…అని పోలీసులు చెబుతున్నారు.