తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన విలువైన ఆస్తులు అమ్మే హక్కు ట్రస్టుబోర్డుకు గానీ ప్రభుత్వానికి గానీ లేదని ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు.”తిరుమల వెంకన్నకు భక్తులు ఇచ్చిన ఆస్తిని నిర్వహించడానికి మాత్రమే మీకు హక్కు ఉంది. అలాంటిది మీరెలా వేలం వేస్తారు?” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదంతా చూస్తుంటే దీని వెనుక హిందుత్వాన్ని అణగదొక్కే కుట్ర దాగివుందనే అనుమానం కలుగుతోందని వ్యాఖ్యానించారు.
టీటీడీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ధోరణిపై బీజేపీ రాజీలేని పోరాటం సాగిస్తుందని కన్నా స్పష్టం చేశారు. తమిళనాడులోని 23 ప్రాంతాల్లో ఉన్న ఆస్తులను అమ్మడం ద్వారా రూ.100 కోట్లు సమకూర్చుకోవాలని టీటీడీ భావిస్తున్నదని, దీనికోసం రెండు కమిటీలు ఏర్పాటు చేయడం నిలిపివేయాలని ఆయన అన్నారు.