సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ప్రాంతీయ ఏరియా వైద్యశాలలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల క్యాంపులో సౌకర్యాలు లేక మహిళలు ఎంతో ఇబ్బంది పడుతున్నారని టిపిసిసి జాయింట్ సెక్రెటరీ ఎండీ అజీజ్ పాషా, సిపిఐ జిల్లా నాయకులు కంబాల శ్రీనివాస్ ఆరోపించారు.
నేడు వారు ఏరియా వైద్యశాలను సందర్శించి అక్కడి బాధితుల సమస్యను తెలుసుకొని వారి ఆందోళనకు పూర్తిస్థాయి సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా పరిధి లొని వివిధ ప్రాంతాల నుండి అనేక మంది మహిళలు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు కొరకు హుజూర్ నగర్ ప్రాంతీయ ఏరియా వైద్యశాలకి వచ్చారని తెలిపారు.
వందలాది మంది మహిళలు మంగళవారం తెల్లవారుఝాము నుండే ఉన్నారని అయితే డాక్టర్లు మాత్రం కేవలం ఈ రోజు ఎనభై మందికి మాత్రమే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేస్తామని చెప్పారని వారన్నారు. దీనితో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వందలాది మహిళలు ఎండకు ఆహారం, నీళ్లు లేక అనేక అగచాట్లు పడుతున్నారని వారు అన్నారు.
కుటుంబ నియంత్రణ క్యాంపు నిర్వహించేటప్పుడు సంబంధిత డాక్టర్లు టెంట్లు, మంచినీటి సౌకర్యం కల్పించాలని, కానీ అటువంటివి కనీస సౌకర్యాలు ఏవీ కూడా ఏర్పాటు చేయలేదని అన్నారు. సుమారు గడిచిన మూడు సంవత్సరాల నుండి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు క్యాంపులు నిర్వహించలేదని వారన్నారు.
ప్రైవేటు వైద్యశాలలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోవాలంటే వేలరూపాల ఖర్చుతో కూడుకున్న సమస్య అని, కిందిస్థాయి సిబ్బంది అందరికీ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారని చెప్పటంతో వందలాది మంది మహిళలు రావడం జరిగిందని వారు తెలిపారు. అయితే వచ్చిన వారికి కనీస సౌకర్యాలు కల్పించటంలో ప్రభుత్వం విఫలమైందని వారు అన్నారు.