పాడి పశువులకు సోకుతున్న లంపి చర్మ వ్యాధిపై ప్రభుత్వ ఉదాసీనతను ప్రశ్నిస్తూ ఒక న్యాయ శాస్త్ర విద్యార్థి లోకాయుక్తను ఆశ్రయించారు. దేశంలో దాదాపు లక్షన్నరకు పైగా పశువులు లంపి చర్మ వాధితో ఇప్పటి వరకూ మరణించాయి. పశువుల నుంచి పశువులకు సోకే ఈ లంపీ స్కిన్ డిసీజ్ వైరస్ (ఎల్ఎస్డివి) పాక్స్ వైరస్తో రైతుకు విపరీతంగా నష్టం జరుగుతున్నది. ప్రభుత్వం ఇలాగే ఉపేక్షిస్తూ కూర్చుంటే దేశంలో పశు సంపద లేకుండా పోతుందని పిటిషనర్ ఆర్ మౌలయ్య తెలిపారు.
కాప్రిపాక్స్ వైరస్ జాతికి చెందిన పాక్స్ వైరస్, షీపాక్స్ వైరస్, గోట్పాక్స్ వైరస్ లు అత్యంత ప్రమాదకరమైనవి కావడంతో పశు సంపద పూర్తిగా నశించిపోయే ప్రమాదం త్వరలోనే ఉందని ఆయన అన్నారు. ప్రభుత్తం ఏం చర్యలు తీసుకుంటున్నదో ప్రశ్నిస్తూ, పశు సంపదను కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలను ఆయన సూచించడంతో లోకాయుక్త రాష్ట్ర ప్రభుత్వ పశు సంవర్ధక శాఖ కార్యదర్శికి నోటీసు జారీ చేసింది.
ప్రభుత్వం ఈ ప్రమాదకరమైన వైరస్ ను అరికట్టడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నదో వివరించాలని లోకాయుక్త ఆదేశించింది. దేశంలోని చాలా రాష్ట్రాలలో ఈ వైరస్ ఇప్పటికే వ్యాపించి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ వైరస్ విస్తరిస్తున్నది. ప్రస్తుతానికి తెలంగాణ లో ఈ వైరస్ కనిపించలేదు కానీ వేగంగా వ్యాపించే అవకాశం ఉన్నందున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సకల చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఆయన లోకాయుక్తను కోరారు.
ఇప్పటికే అనారోగ్యంతో ఉన్న పశువులను గుర్తించి వాటిని ఇతర పశువుల నుంచి వేరు చేసే చర్యలను ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ఆయన కోరారు. లంపి వైరస్ కు వ్యాక్సిన్ ఇప్పటి వరకూ కనిపెట్టినందున గోట్ పాక్స్ కు వేసే టీకా ను పశువులకు తక్షణమే వేయాలని పిటిషనర్ మౌలయ్య కోరారు.
జీవ భద్రత చర్యలు చేపట్టాలని, వెక్టర్ నియంత్రణ, క్రిమిసంహారక చర్యలు, పర్యావరణాన్ని శుభ్రపరిచే చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. వ్యాధికి సంబంధించిన వివరాలను రైతులకు అందచేసి అవగాహన కార్యక్రమం నిర్వహించాలని కూడా మౌలయ్య కోరారు.
అదే విధంగా ఈ వైరస్ తో మరణించిన పశువులకు సంబంధించి యాజమానికి నష్టపరిహారం ఇప్పించాలని ఆయన లోకాయుక్తను కోరారు. పిటిషన్ తీసుకున్న వెంటనే సమస్య తీవ్రతను గుర్తించిన లోకాయుక్త సంబంధిత కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో అఫిడవిట్ సమర్పించాలని లోకాయుక్త ఆదేశాలు జారీ చేసింది.