ఢిల్లీలోని బల్జీత్ నగర్లో జరిగిన హత్య ఘటన నేపథ్యంలో ఢిల్లీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఆదివారం లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు ఘాటైన లేఖ రాశారు. పబ్లిక్ ఆర్డర్ను కాపాడేందుకు తన రాజ్యాంగ బాధ్యతను లెఫ్టినెంట్ గవర్నర్ గుర్తించాలని కోరారు.
నగరంలో క్రైమ్ గ్రాఫ్ పెరిగిందని, ఢిల్లీ క్రైమ్ క్యాపిటల్గా మారినట్లు కనిపిస్తోందని సిసోడియా తన లేఖలో పేర్కొన్నారు. ఢిల్లీలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని కూడా ఆయన ఆరోపించారు. ఢిల్లీలో శాంతిభద్రతల పరిరక్షణ బాధ్యతను రాజ్యాంగం మీకు (లెఫ్టినెంట్ గవర్నర్) అప్పగించిందని, పోలీసులు నేరుగా మీకే రిపోర్టు చేస్తారని మనీష్ సిసోడియా లేఖలో పేర్కొన్నారు.
దయతో ఈ విషయంలో కాస్త శ్రద్ధ పెట్టవలసిందిగా కోరుతున్నాను అని ఆయన అన్నారు. ఢిల్లీలో ఇటీవల జరిగిన నేర ఘటనలను కూడా సిసోడియా లేఖలో ప్రస్తావించారు. ఢిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీని రూపొందించి అమలు చేయడంలో జరిగిన అవినీతికి సంబంధించి సీబీఐ తనను సోమవారం విచారణకు పిలిచిన తరుణంలో లెఫ్టినెంట్ గవర్నర్కు ఆయన ఈ లేఖ రాశారు.
ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు సిసోడియాను సోమవారం ఉదయం 11 గంటలకు సిబిఐ ప్రధాన కార్యాలయంలో హాజరు కావాలని కోరినట్లు సిబిఐ అధికారులు తెలిపారు. అదే సమయంలో, సిసోడియా ఆదివారం ట్వీట్ చేస్తూ, ‘నా ఇంట్లో 14 గంటలు సీబీఐ దాడులు నిర్వహించింది, ఏమీ బయటకు రాలేదు. నా బ్యాంక్ లాకర్ను వెతికారు, దాని నుండి ఏమీ బయటకు రాలేదు. మా గ్రామంలో వారికి ఏమీ దొరకలేదు. ఇప్పుడు వాళ్లు నన్ను రేపు ఉదయం 11 గంటలకు సీబీఐ ప్రధాన కార్యాలయానికి పిలిచారు. నేను వెళ్లి నా పూర్తి సహకారం అందిస్తాను. సత్యమేవ జయతే.’ అని పేర్కొన్నారు.