గోడ కూలిన ప్రమాదంలో మరణించిన ముగ్గురు చిన్నారుల కుటుంబాన్ని ఎంఆర్ పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ నేడు పరామర్శించారు. హైదరాబాద్ నాంపల్లి ప్రాంతంలోని మల్లెపల్లి డివిజన్ లోని అప్జల్ సాగర్ మంగర్ బస్తి లో ఈ ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.
చిన్నారుల కుటుంబీకులను మంద కృష్ణ మాదిగ, మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య, ఎం ఎల్ సి రాములు నాయక్ పరామర్శించారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చిన్నారులు చనిపోవడం చాలా బాధాకరమని, వారి కుటుంబానికి తక్షణమే వారికి 75 లక్షల రూపాయల పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని వారు డిమాండ్ చేసారు.
ఈ మేరకు వారు మున్సిపల్ మంత్రి కేటీఆర్, జిల్లా కలెక్టర్, GHMC కమిషనర్ లకు విజ్ఞప్తి చేశారు. ఈ సంఘటన స్థలానికి కనీసం ఇప్పటి వరకూ వచ్చి చూడని ప్రభుత్వ అధికారులు, మంత్రులు తక్షణమే బాధితులకు న్యాయం జరగకపోతే జిల్లా వ్యాప్తంగా కార్యాచరణ చేపడతామని వారు హెచ్చరించారు.