వైసీపీ నుంచి జనసేనకు కాపు నేతల వలసలు సాగుతున్నాయి. వైసీపీని వీడి పంచకర్ల.. ఆమంచి జనసేనలో చెరనుండగా వారి బాటలో మరికొంత మంది ముఖ్య నేతలు చేరనున్నారు. దీంతో జగన్ రెడ్డి గుండెల్లో గుబులు రేకెత్తిస్తోంది. రానున్న ఎన్నికల్లో వై నాట్ 175 అని చెబుతున్న అధికార వైసీపీ అధినేతకు తాజా రాజకీయ పరిణామాలు మిగుడు పడడం లేదు. ఒక వైపు అధికార వైసీపీ పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి…
మరో వైపు సొంత పార్టీలో రోజు రోజుకూ పెరుగుతున్న అసమ్మతి, అంతర్గత పోరాటంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న సీఎం జగన్ రెడ్డికి ఇంకోవైపు కీలక కాపు నేతలు పార్టీని వీడి ప్రత్యర్థి జనసేన పార్టీలో చేరడం మింగుడు పడకుండా వుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాపుల ఒట్టు గంపగుత్తగా అధికార వైసీపీకి అనూహ్య విజయంతో పాటు అంచనాలకు మించి 151 సీట్లు వచ్చాయి. ఈ సారి కూడా కాపుల ఓట్లు తమకే పడి తిరిగి అధికారం చేపట్ట వచ్చనే జగన్ రెడ్డి భ్రమలు తొలిగి పోతున్నాయి.
పార్టీ నుంచి ముఖ్యమైన కాపు నేతలు ఒక్కొక్కరూ వీడి పోతున్నారు. ఎన్నికలు మరో ఆరు నెలల్లో జరుగనున్న తరుణంలో కాపు నేతలు వైసీపీ నుంచి బయటకు రావడం రాజకీయంగా చర్చనీయాంశం అయింది. విశాఖపట్నం జిల్లా వైసీపీ అధ్యక్షుడు పంచకర్ల రమేశ్బాబు ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేసి ఆదివారం జనసేనాని పవన్ కల్యాణ్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పంచకర్ల వైకాపాలో పరిణామాలపై విమర్శలు చేశారు.
కష్టకాలంలో పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలను సీఎం వద్దకు తీసుకెళ్లేందుకు ఏడాదిగా ప్రయత్నించినా అవకాశం రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఈ విషయంలో నా చేతగానితనాన్ని కార్యకర్తలు క్షమించాలి’ అని విన్నవించారు. ‘రాష్ట్రంలో, జిల్లాలో జరిగే కొన్ని విషయాలు సీఎం దృష్టికి తీసుకెళ్లాలని ప్రయత్నించినా అవకాశం రాలేదు. ఈ బాధ, ఆవేదనతోనే అధ్యక్ష పదవి వదులుకుంటానని చెప్పినా.. కొంత మంది పార్టీ నేతలు కనీసం పట్టించుకోలేదన్నారు.
కార్యకర్తలు నిరాశలో ఉన్నారని సీఎంకు చెప్పాలని ప్రయత్నించా. అవకాశం రాకపోవడంతో నా పరిస్థితిపై నాకే జాలేస్తోంది. అధ్యక్షుడంటూనే స్వేచ్ఛ ఇవ్వలేదు. ఏమీ చేయలేనప్పుడు ఇంత ముఖ్యమైన పదవిలో, పార్టీలో ఉండకపోతేనే మంచిదని భావించి రాజీనామా చేసానని అని తెలిపారు.ఈ నెల 20న జనసేనాని పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు.. రానున్న ఎన్నికల్లో పంచకర్ల రమేశ్బాబు పెందుర్తి అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. పంచకర్ల చేరికతో విశాఖలో జనసేన బలం పుంజుకుంటుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.
ఇదిలా వుండగా ప్రకాశం జిల్లాలో కాపు సామాజివర్గం బలమైన నేత చీరాల మాజీ ఎమ్మెల్యే, పర్చూరు వైకాపా ఇన్ఛార్జి ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి శ్రీనివాసులు(స్వాములు) శనివారం జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమంచి స్వాములుకు పార్టీ అధినేత పవన్ కల్యాణ్ జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇటీవల చీరాల నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున స్వాములు ఫొటోతో కూడిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది.
ఈనేపథ్యంలో ఆయన జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. స్వాములు చేరిక సందర్భంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని వివిధ నియోజకవర్గాల నుంచి దాదాపు వెయ్యి కార్లలో ఆయన మద్దతుదారులు తరలివచ్చారు. రాష్ట్రంలోని పలు నియోజక వర్గాలకు చెందిన వైసీపీలోకి కాపు నేతలు.. మరికొంత మంది ప్రజా ప్రతినిధులు అధికార వైసీపీ నేతల పట్ల విసిగి టీడీపీ, జనసేన పార్టీల్లో చేరేందుకు సమాయత్తం అవుతున్నట్లు సమాచారం.