అది ప్రభుత్వ కార్యాలయం… అందులోనూ ప్రభుత్వానికి ఆదాయ వనరులను సమకూర్చే శాఖ… అంతేకాదు భూములకు సంబంధించిన కీలక వివరాలు ఉండే డిపార్ట్ మెంట్… అదే రిజిస్ట్రేషన్ శాఖ… అలాంటి ప్రభుత్వ కార్యాలయం అస్తవ్యస్తంగా మారిపోయింది. ఇద్దరు, ముగ్గురు డాక్యుమెంట్ రైటర్ల కనుసన్నల్లో కార్యాలయం నడుస్తున్నట్లు తెలుస్తోంది. వారు కార్యాలయంలో కీలక వ్యవహారాలు నడుపుతున్నట్లు సమాచారం. అలాంటివారు శాఖలో చొరబడటం కీలక సమాచారానికి రక్షణ లేకుండా పోతోందన్న ప్రచారం జరుగుతోంది.
కంప్యూటర్ల వద్ద వారే వ్యవహారాలు చూస్తున్నట్లు తెలియ వచ్చింది. కొన్ని నెలల క్రితం అక్కడ పనిచేస్తున్న సబ్ రిజిస్ట్రార్ కుమారస్వామి రెడ్డి దీర్ఘకాలిక సెలవు పై వెళ్లడంతో కార్యాలయం గాడి తప్పింది. ఇన్చార్జ్ సబ్ రిజిస్ట్రార్ లతో నడుస్తోంది. గత రెండు నెలలుగా ఒకరిద్దరు డాక్యుమెంట్ రైటర్లు ఆ శాఖలో విధులు నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇన్చార్జ్ సబ్ రిజిస్ట్రార్ కు ప్రమాదం జరగడంతో కొద్దిరోజులు సెలవుపై వెళ్లారు.
అంతేకాక ఇటీవల అనంతపురం అర్బన్ రిజిస్ట్రేషన్ కార్యాలయంపై ఏసీబీ దాడులు జరగటం, ప్రైవేటు వ్యక్తులను విధులకు బయటకు పంపాలన్న ఆదేశాలు వెలువడ్డాయి. దాంతో వారు కూడా బయటికి వెళ్లిపోవడంతో అక్కడ ఉన్న ఇద్దరు, ముగ్గురు డాక్యుమెంట్ రైటర్లు కార్యాలయంలోకి చొరబడినట్టు తెలిసింది.
రిజిస్ట్రేషన్లు జరిగే కీలక విధులలో వారు పాల్గొనడం డాక్యుమెంట్లు తారుమారయ్యే ప్రమాదం ఉందనీ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై అధికారుల పర్యవేక్షణ లేదన్న అంశం తేట తెల్లమైంది. ఇంత జరుగుతున్నా అధికారుల దృష్టికి వెళ్లలేదంటే నమ్మశక్యంగా లేదు.
ఇంతకుముందు వున్న ఇన్చార్జి మహిళా అధికారిని డాక్యుమెంట్ రైటర్ల ప్రవేశంపై స్థానికులు ప్రస్తావించినట్టు తెలిసింది. పై అధికారులకు చెప్పి పోస్టులు భర్తీ చేయించండి అంటూ సమాధానమిచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా మేలుకోకపోతే కార్యాలయం మొత్తానికే మోసం వచ్చే ప్రమాదం ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.