కోనసీమ జిల్లాలో అధికార వైసీపీలో ముసలం పుట్టింది. మంత్రి చెల్లుబోయిన, ఎంపీ బోస్ వర్గాల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఉభయ వర్గాలు బాహా భాహీకి తలపడు తున్నాయి. మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న రామచంద్రాపురం సీటు కోసం రెండు వర్గాలు కుస్తీ పడుతున్నాయి.
దీంతో రెండు వర్గాల మధ్య విభేదాలు ఇప్పటికే తారా స్తాయికి చేరాయి. ఇదిలా వుండగా మంత్రి చెల్లు బోయినపై ఎంపీ బోస్ వర్గం తిరుగుబావుటా ఎగరవేసింది. ఆదివారం రామచంద్రాపురం నియోజక వర్గం వెంకటయ్య పాలెంలో ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ వర్గీయులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
చంద్రబోస్పై అభిమానంతో మంత్రి వేణును గెలిపించామని, అలాంటిది తమ మీదే రౌడీషీట్ తెరిపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి కుమారుడు రాజ్యాంగేతర శక్తిగా మారారని, వైకాపాను మంత్రి నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
శెట్టిబలిజలను మంత్రి వేణుగోపాలకృష్ణ అణగదొక్కేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈసారి ఆయనకు టికెట్ ఇస్తే కచ్చితంగా ఓడిస్తామని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబోస్ కుటుంబానికి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైకాపా టికెట్ ఇవ్వకపోయినా, బోస్ కుమారుడిని గెలిపిస్తామని ఆయన అభిమానులు స్పష్టం చేశారు. రూ.12 కోట్లు ఖర్చు పెట్టానని, డబ్బులిస్తేనే పనులు చేస్తానని మంత్రి చెబుతున్నారని మండిపడ్డారు.
ఈ నెల 26న అమలాపురంలో సీఎంను కలిసి పరిస్థితులు వివరిస్తామని చంద్రబోస్ అనుచరులు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో పిల్లి సూర్యప్రకాశ్కు వైకాపా టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో ఈ నియోజకవర్గం నుంచి ఎంపీ పిల్లి సుభాష్ చంద్ర బోస్ ప్రాతినిధ్యం వహించారు. తిరిగి తమ సీటు దక్కించుకునేందుకు పిల్లి వర్గం పట్టు బడుతోంది.
అయితే సీఎం జగన్ ఈ సీటును సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి చెల్లు బోయినకే కేటాయించదాన్ని ఎంపీ పిల్లి వర్గీయులు వ్యతిరేకిస్తున్నారు.. చెల్లు బోయినకు సీటిచ్చినా ఒడిస్తామని ఎంపీ బోస్ వర్గీయులు సీఎం జగన్ రెడ్డికి అల్టిమేటం జారీ చేయడం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. వీరుభయులు శెట్టి బలిజ వర్గానికి చెందిన వారు కావడంతో వీరిద్దరి వివాదం పార్టీ అధినేత జగన్ రెడ్డికి తలనెప్పిగా మారింది. ఈ విషయంలో జగన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాల్సి వుంది.