వరంగల్ నగరంలో గత రెండు రోజుల నుండి కురిసిన భారీ వర్షాల వల్ల ముంపునకు గురైన 24,47వ డివిజన్ లోని ప్రాంతంలో రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ పర్యటించారు. స్థానిక పరిస్థితులను, ముంపునకు గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
మంత్రితోతో పాటు వరంగల్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గుండా ప్రకాష్ రావు, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, కమిషనర్ పమేలా సత్పతీ ఇతర అధికారులు, స్థానిక నేతలు ఉన్నారు. ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలను తొలగించడంలో ప్రజలందరూ సహకరించాలని, ప్రజా ప్రయోజనాలకు తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ కి వరంగల్ నగరం అంటే అత్యంత ప్రేమ ఉందని, ఈ నగరం అభివృద్ధి కోసం ఎన్ని నిధులు అయినా ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నారని, వరంగల్ ప్రజలు సుఖ, సంతోషాలతో ఉండేందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందించి అమలు చేసేందుకు అధికారులను ఇప్పటికే ఆదేశించారని మంత్రి తెలిపారు.
ఇటీవల వరంగల్ నగరం ముంపునకు గురైనప్పుడు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ని పంపించి పర్యవేక్షణ చేయించారని, భవిష్యత్తులో ముంపు సమస్య లేకుండా చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారని, తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీని కచ్చితంగా నెరవేరుస్తుందని మంత్రి తెలిపారు.