ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ పరోక్షంగా ముస్లిం నేతలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి.
యూపీలోని కుషీనగర్ లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం యోగీ ఆదిత్యనాథ్ మాట్లాడుతూ ‘‘2017 కి ముందు ఉన్నట్లుగా ఇప్పుడు రేషన్ పొందలేరు. ఎందుకంటే, అప్పుడు ‘అబ్బా జాన్’ చెప్పే వ్యక్తులు మాత్రమే రేషన్ వస్తువులను జీర్ణం చేసుకునేవారు. కుషినగర్ రేషన్లు నేపాల్, బంగ్లాదేశ్కు వెళ్లేవి. ఈ రోజు, పేద ప్రజల కోసం ఉద్దేశించిన రేషన్ ఎవరైనా మింగడానికి ప్రయత్నిస్తే, వాళ్లు జైలు పాలు అవుతారు’’ అని వ్యాఖ్యానించారు.
అబ్బాజాన్ అనే పదానికి అర్ధం తండ్రి అని అందరికీ తెలిసిందే. ముస్లింలు ఎక్కువగా వాడే ఈ పదాన్ని ముఖ్యమంత్రి యోగీ ముస్లిం నేతలను ఉద్దేశించి అన్నట్లుగా అర్ధం వస్తున్నది. దాంతో ఈ వ్యాఖ్యలను ఏన్డీయే మిత్రపక్షమైన జేడీయూ తీవ్రంగా ఖండించింది.
ఆ పార్టీ అధ్యక్షుడైన లలన్ సింగ్ ఈ అంశంపై మాట్లాడుతూ రాజకీయాలు చేసే వారు .. వ్యాఖ్యల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దేశానికి హాని కలిగించేలా వ్యాఖ్యలు చేయకూడదని అన్నారు. దేశం హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు లేదా ఏ ఇతర కమ్యూనిటీ అయినా అందరికీ చెందినదని, రాజకీయ పార్టీలు తమ వ్యాఖ్యలలో సంయమనం పాటించాలని జనతాదళ్-యునైటెడ్ ప్రెసిడెంట్ లాలన్ సింగ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యలపై కౌంటర్ వేయడం చర్చనీయాంశం అయింది.
మన దేశానికి భిన్నత్వంలో ఏకత్వం అనేది ఉందని, దేశం అందరికీ చెందిందని, దేశానికి హాని కలిగించే వ్యాఖ్యలు ఎవ్వరూ చేయకూడదని లలన్ సింగ్ వ్యాఖ్యానించారు. యోగీ వ్యాఖ్యలపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తం అవుతున్నవేళ.. మిత్రపక్షాలు సైతం గరం కావడం చర్చనీయాంశంగా మారింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ వ్యాఖ్యలు మరింత రాజకీయ వేడిని రగుల్చుతాయని విశ్లేషకులు సైతం అంచనా వేస్తున్నారు.