ఏపి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత బాబాయి హత్య కేసులో ఆయన సోదరుడు, కడప ఎంపి అవినాష్ రెడ్డికి సీబీఐ విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే తనకు సీబీఐ నోటీసు అతి తక్కువ సమయంలో అందిందని, ముందుగానే నిర్ణయించుకున్న కార్యక్రమాల వల్ల తాను బిజీగా ఉన్నందున ఐదు రోజుల తర్వాత వస్తానని ఆయన సీబీఐకి తెలిపారు.
విచారణకు తాను పూర్తిగా సహకరిస్తానని కూడా ఆయన చెప్పారు. గత రెండున్నర సంవత్సరాలుగా తనపై , తన కుటుంబం పై ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అసత్యపు ఆరోపణలు చేస్తోందని ఆయన ఈ సందర్భంగా అన్నారు. తనపై వచ్చిన అభియోగాలు జీర్ణించుకోలేకపోతున్నట్లు ఆయన అంటున్నారు. తానేమిటో తన వ్యవహార శైలి ఏమిటో ఈ జిల్లా ప్రజలకు అందరికీ బాగా తెలుసునని ఆయన అంటున్నారు.
న్యాయం గెలవాలి. నిజం వెల్లడి కావాలా అన్నదే నా ధ్యేయం.. మీడియా ముఖ్యంగా కోరుకుంటున్న నిజం తేలాలని నేను కూడా భగవంతుడు ని కోరుకుంటున్నా… ఆరోపణ చేసేవారు మరొకసారి ఆలోచించాలి ఇలాంటి ఆరోపణ చేస్తే మీ కుటుంబాలు కూడా ఎలా ఫీల్ అవుతారో ఒకసారి ఊహించుకోండి..అని అవినాష్ రెడ్డి అన్నారు.