పులులు అంతరించిపొతున్న ఈ సమయం లో వాటిని కాపాడాల్సిన బాధ్యత సమాజం లో అందరిపైన ఉన్నది. అయితే ఈ బాధ్యత మరచిన వేటగాళ్లు పులుల్ని చంపుతూనే ఉన్నారు. అదనపు డబ్బు సంపాదించాలనే ఆలోచనతో పులి వేట మొదలు పెట్టిన ఐదుగురు ములుగు పోలీసులకు చిక్కారు. ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం నుండి వచ్చిన పెద్ద పులి జాడలను తాడ్వాయి అటవీ ప్రాంతంలో అటవీ అధికారులు ఈ ఏడాది ఆగష్టు లో పాద ముద్రల ద్వారా గుర్తించారు.
పులి కదలికలు ములుగు, మహబూబాబాద్, కొత్తగూడెం, వరంగల్ రూరల్ జిల్లాలలో ఉన్నట్లు అటవీ అధికారులు గుర్తించారు. పులి కదలికలను నిరంతరం పర్యవేక్షించడానికి నాలుగు జిల్లాల అటవీ అధికారులను సమన్వయపరుస్తూ అటవీ ప్రాంతంలో గస్తీని మరింత బలోపేతం చేశారు. అటవీ ప్రాంతంలో గస్తీని ముమ్మరం చేస్తూ నిఘా కెమెరా లను ఏర్పాటు చేశారు. కొందరు పులి ని చంపి దాని గోర్లను, చర్మాన్ని అమ్మడానికి చత్తీస్ఘడ్ వెళుతున్నారని తాడ్వాయి పోలీస్ వారికి పక్కా సమాచారం అందింది.
దాని కోసం అటవీశాఖ అధికారుల సహాయంతో వాహనాలను తనిఖీ చేశారు. నేటి ఉదయం కాటాపూర్ క్రాస్ వద్ద ఒక వాహనంలో నలుగురు వ్యక్తులు అనుమానాస్పద రీతిలొ కనిపించారు. వారిని తనిఖీ చెయ్యగా వారి వద్ద పులి గోరు కనిపించింది. వారివద్ద నుంచి పులి చర్మం, పులి గోర్లు, పులి కళేబరం, పులి ఎముకలు, ఉచ్చులు స్వాధీనం చేసుకున్నారు.
మడకం నరేష్, మడవి ఇడుమయ్య, మడకం ముకేశ్, మడవి దేవా, మడవి గంగయ్య లను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వీరంతా వారు చేసే కూలి డబ్బులు సరిపోక పులిని వేటాడాలనే దురాలోచనతో ఉచ్చులు పెట్టేవారు. అందులో పులి పడి అది చనిపోయింది. దాంతో దానికి సంబంధించిన గోర్లు, చర్మం అమ్ముకోవడానికి వీరు ప్రయత్నించారని పోలీసులు తెలిపారు.