జిహెచ్ఎంసి మేయర్ బొంతు రామ్మోహన్, బొంతు శ్రీదేవి యాదవ్ బుధవారం మూసి పురానాపూల్ కమాన్ వద్ద గంగమ్మతల్లికి పూజలుచేసి పట్టువస్త్రాలు, పసుపు కుంకుమ, వెండి చాటలో నవరత్నాలు సమర్పించారు. మూసి ఒడ్డున ఉన్న అమ్మవారి గుడి దగ్గర మేయర్ దంపతులు అపవర్ణ యాగాన్ని నిర్వహించారు.
ఈ పూజ కార్యక్రమాల్లో రాష్ట్ర హోం మంత్రి మహ్మద్ మహ్మూద్ అలీ, రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య, సినిమాటోగ్రఫి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, డిప్యూటి మహ్మద్ బాబా ఫసియుద్దీన్, కార్పొరేటర్లు పాల్గొన్నారు. అనంతరం పురానాపూల్ సమీపంలోని మూసా ఖాద్రి దర్గా కు చాదర్ ను మంత్రులు, మేయర్, కార్పొరేటర్ల సమక్షంలో డిప్యూటి మేయర్ మహ్మద్ బాబా ఫసియుద్దీన్ సమర్పించారు.
1908 సెప్టెంబర్ 20 న మూసికి వచ్చిన భారీ వరదల వలన అపార ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. దాదాపు 15 వేల మంది మృతి చెందారు. అనేక భవనాలు, వంతెనలు కూలిపోయాయి. అప్పటి నిజాం రాజు అయిన మీర్ మహబూబ్ అలీ ఖాన్ వద్ద జుమాల్ లాల్ తివారి అనే పండితుడు మంత్రిగా ఉండేవారు.
గంగమ్మ తల్లికి ఆగ్రహం కలిగి ఉగ్రరూపం దాల్చినందున, మూసికి వచ్చిన భారీ వరదతో ఇంత నష్టం జరిగిందని, గంగమ్మ తల్లిని శాంతింపచేయుటకు ప్రత్యేక పూజలు నిర్వహించాలని నిజాం రాజుకు జుమాల్ లాల్ తివారి సూచించారు.
దానికి అంగీకరించిన నిజాం రాజు మీర్ మహబూబ్ అలీ ఖాన్ పురానాపూల్ వద్ద మూసి నదిలో నడుం లోతు నీళ్లలోకి దిగి శాంతించాలని గంగమ్మ తల్లిని వేడుకుంటూ అమ్మవారికి పూజలు నిర్వహించి 101 బంగారు చాటలలో పట్టువస్త్రాలు, పసుపు కుంకుమ, ముక్కు పుడక, వజ్రవైడుర్యాలు, ముత్యాలు, రత్నాలు, పగడాలు సమర్పించారు.
అదేవిధంగా మూసా ఖాద్రి దర్గాకు నాటి నిజాం రాజు మహబూబ్ అలీ ఖాన్ సాంప్రదాయకంగా చాదర్ సమర్పించారు. నాటి సాంప్రదాయాన్ని గుర్తు చేసుకుంటూ నేడు అదే చోట మూసి నదిలో మేయర్ బొంతు రామ్మోహన్ సతీసమేతంగా పూజలు నిర్వహించి గంగమ్మ తల్లికి వెండి చాటలో నవరత్నాలు, పట్టు వస్త్రాలు, పసుపు కుంకుమ, ముక్కుపుడక, ముత్యాలు సమర్పించారు. అనంతరం అమ్మవారి గుడి దగ్గర అపవర్ణ యాగాన్ని నిర్వహించారు.