నేరాలు జరిగినట్లు సమాచారం వచ్చిన వెంటనే స్పందించి నేర స్థలానికి త్వరగా చేరుకోవాలని నిర్మల్ జిల్లా ఎస్పీ సి.శశిధర్ రాజు ఆదేశించారు. నేడు నిర్మల్ డీఎస్పీ కార్యాలయంలో నిర్మల్ సబ్-డివిజన్ పోలీస్ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు.
కేసులకు సంబంధించి ఈ వివరాలలో వెంటనే ఆన్ లైన్ లో పూర్తి డేటాతో నమోదు చేయాలని అన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడి శిక్షలు పడిన వారి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడానికి ఆర్టీవోకు సిఫారసు చేయాలని ఎస్ పి సూచించారు. కోర్టుల్లో డిస్పోజల్, కన్వెక్షన్ అయిన కేసుల వివరాలు వెంటనే ఆన్లైన్లో నమోదు చేయాలని తెలిపారు.
దొంగతనం కేసులలో నేరస్థులపై హిస్టరీ షీట్లు ఓపెన్ చేయాలని సూచించారు. పోలీస్ స్టేషన్లకు వచ్చే బాధితుల పట్ల అన్నివేళల్లో ఒకే విధంగా స్పందించాలని, ఈ పెట్టీ, ఈ చాలన్ కేసులపై దృష్టి సారించాలని అన్నారు. అవసరమైన కేసుల్లో టెక్నాలజీని విరివిగా ఉపయోగించి నేరాల ఛేదనకు కృషి చేయాలని సూచించారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు తగిన చర్యలు చేపట్టాలని రోడ్ సేఫ్టీ, ప్రికాషన్స్, వేగ నియంత్రణ, డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రాఫిక్ చట్టాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో DSP ఉపేదర్ రెడ్డి, CI’s జాన్ దివాకర్, జీవన్ రెడ్డి, జైరాం నాయక్, నిర్మల్ సబ్-డివిజన్ SIలు పాల్గొన్నారు.