కరోనా సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నష్టాల్లో ఉన్నందున అదనపు సంపాదన కోసం ఆబ్కారీ శాఖనే టార్గెట్ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
ఒక వైపు మద్య పానాన్ని అదుపు చేయాలని చెబుతూనే దాదాపు 300 కోట్ల రూపాయలు కేవలం బార్ ల నుంచే ముక్కు పిండి వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్ టాక్స్ పేరుతో మరో 40 కోట్ల రూపాయలు కేవలం బార్ ల నుంచే వసూలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది.
ప్రస్తుతం ఉన్న 840 బార్ల లైసెన్స్లనూ కొనసాగించాలని అబ్కారీ శాఖ నిర్ణయించింది. వీటికి వచ్చే ఏడాది జూన్ 30 వరకు గడువు ఉంటుందని ఉత్తర్వులు జారీ చేసింది.
బార్లు తెరుచుకునేందుకు అనుమతి ఇస్తూనే లైసెన్స్పై 20 శాతం కోవిడ్ ఫీజు వసూలు చేయాలని నిర్ణయించారు. అలాగే పది శాతం మేర అడిషనల్ రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ విధించబోతున్నారు.
లైసెన్స్ రిజిస్ట్రేషన్ ఛార్జీలను కూడా పది శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. 2020-21 ఏడాదికి ఈ అదనపు రుసుముల్ని వసూలు చేస్తామని వెల్లడించారు. కోవిడ్ ఫీజుల ద్వారా 40 కోట్ల రూపాయలు, అడిషనల్ రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ ద్వారా 300 కోట్ల రూపాయల అదనపు ఆదాయం వస్తుందని అంచనా వేస్తోంది.
మరోవైపు విదేశీ మద్యం, దేశంలో తయారైన విదేశీ మద్యం, రెడీ టూ డ్రింక్ మద్యం, బీర్లపైనా 10 శాతం మేర అడిషనల్ రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ విధిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది.