తెలంగాణ మాదిగ హక్కుల దండోరా అధ్యక్షుడు వేముల బలరాం
నో బీజేపీ.. నో కాంగ్రెస్.. ఓన్లీ బీఆర్ఎస్.. ఇదే మా నినాధమని తెలంగాణ మాదిగ హక్కుల దండోరా అధ్యక్షుడు వేముల బలరాం అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వేముల బలరాం మాట్లాడుతూ.. మాదిగ, మాల ఉపకులాలు బీఆర్ఎస్ కు మద్దతివ్వాలని నిర్ణయించామనన్నారు. ఇటీవల హైదరాబాదులో నిర్వహించిన విశ్వరూప మహాసభలు కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోడీ ఎస్సి వర్గీకరణ చేస్తామని మోసపూరిత మాటలు చెప్పారన్నారు.
బీజేపీకి మాదిగల ఓట్లు తాకట్టు పెట్టడానికి మందకృష్ణ మాదిగ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. గతంలో చంద్రబాబు నాయిఫు, వైఎస్ఆర్ లకు మాదిగల ఓట్లు అమ్ముకున్నారని ఆరోపించారు. ప్రస్తుతం మందకృష్ణ మాదిగను నమ్మే పరిస్థితి లేదన్నారు. ముస్లింల వ్యతిరేక పార్టీ, మతతత్వ పార్టీ బీజేపీ అని మండిపడ్డారు. అసెంబ్లీలో రెండుసార్లు ఎస్సి వర్గీకరణపై తీర్మానం చేసి పంపితే పదేళ్లుగా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని, ఇప్పుడు ఎస్సి వర్గీకరణ గుర్తుకొచ్చిందా అని ప్రశ్నించారు. కామారెడ్డిలో సీఎం కేసీఆర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో తెలంగాణ మాదిగ హక్కుల దండోరా వ్యవస్థాపకులు జన్ను కనకరాజు, ఇటిక రాజు మాదిగ, లక్ష్మణ్, సత్తయ్య, రాజమని, స్వరూప, శ్రీను, కిషన్, దశరత్, రవి పాల్గొన్నారు.
సత్యం న్యూస్, కామారెడ్డి