ఇరాన్తో చర్చలకే అధ్యక్షుడు ట్రంప్ మొగ్గు చూపుతున్నారని అమెరికా రక్షణ మంత్రి మార్క్ ఎస్పర్ ప్రకటించిన నేపత్యంలో అమెరికాతో ఉద్రిక్తతలు తగ్గాలనే తాము కోరుకుంటున్నామని ఇరాన్ ప్రకటించింది. శాంతి నెలకొనేందుకు ముందు ఉద్రిక్తతలు తగ్గాలని ,అగ్రరాజ్యంతో చర్చలు మాత్రం అమెరికా విధించిన ఆర్థిక ఆంక్షలను ఎత్తివేసిన తరువాతేనని ఇరాన్ స్పష్టం చేసింది. ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానిల మధ్య టెహ్రాన్లో సోమవారం రాత్రి చర్చలు జరిగాయి.
ప్రాంతీయంగా నెలకొన్న సంక్షోభాన్ని పరిష్కరించాలంటే ఉద్రిక్తతలు తొలగాలని, చర్చ లు జరగాలని భావిస్తున్నట్లు ఇరువురు నేతలు అభిప్రాయపడ్డారు. ‘ఉద్రిక్తతలు తగ్గేందుకు, చర్చలు జరిగేందుకు అంతా కృషి చేయాలి.అదొక్కటే ఈ సంక్షోభానికి పరిష్కారం’ అని ఖతార్ ఎమిర్ వ్యాఖ్యానించారు. ‘ఈ ప్రాంత రక్షణను దృష్టిలో పెట్టుకుని సంబంధిత వర్గాలతో మరిన్ని చర్చలు జరపాలని నిర్ణయించాం’ అని ఇరాన్ అధ్యక్షుడు రౌహానీ పేర్కొన్నారు.
పాకిస్తాన్ విదేశాంగ మంత్రితోనూ రౌహానీ సమావేశమయ్యారు. ఇరాన్, యూఎస్ల మధ్య మధ్యవర్తిత్వానికి సిద్ధమని ఇటీవల పాకిస్తాన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇరాన్తో చర్చలకే అధ్యక్షుడు ట్రంప్ మొగ్గు చూపుతున్నారని అమెరికా రక్షణ మంత్రి మార్క్ ఎస్పర్ వ్యాఖ్యానించారు. ఖతార్ అమెరికాకు, ఇరాన్కు నమ్మకమైన మిత్రదేశం. ఈ ప్రాంతంలో అమెరికా అతి పెద్ద మిలటరీ బేస్ ఖతార్లోనే ఉంది.అందువల్లే ఖతార్ ఎమిర్ చార్వ్హాలకు శ్రీకారం చుట్టడం గమనార్హం.