కరోనా వైరస్ కారణంగా దేశం మొత్తం సమస్యల్లోకి వెళుతుందని, మరణాల సంఖ్య అత్యధికంగా ఉంటుందని అనుకున్నా ఆ పరిస్థితి లేదని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వెల్లడించారు. ఇస్లామాబాద్ లో నేడు మీడియాతో మాట్లాడిన ఆయన పాకిస్తాన్ లో కరోనా ప్రభావం ఎక్కువగా లేదని ప్రకటించారు.
అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని అందువల్లే కరోనా వైరస్ ను కట్టడి చేయగలిగామని ఆయన అన్నారు. దేశంలో అందుబాటులో ఉన్న వెంటిటేటర్లు సరిపోవని ముందుగా భయపడ్డామని అయితే ఉన్న వెంటిలేటర్లు అన్నీ వాడాల్సిన అవసరం కూడా రావడం లేదని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. కరోనా వైరస్ పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని ఆయన స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో కరోనా వైరస్ కారణంగా మరణాలు పెరిగే అవకాశం ఉందని అయితే ఐరోపా దేశాలతో పోల్చినంత తీవ్రత ఉండదని పాకిస్తాన్ ప్రధాని తెలిపారు. ప్రజలు ప్రభుత్వానికి అనుకున్న రీతిలో సహకరిస్తే మే 9 తర్వాత లాక్ డౌన్ ఎత్తివేసే విషయాన్ని పరిశీలిస్తామని ఆయన వెల్లడించారు. పాకిస్తాన్ పక్కనే ఉన్న ఇరాన్ లో కరోనా తీవ్రమైన కల్లోలం సృష్టించిన విషయం తెలిసిందే.