ఆర్మీ నియామకాల కోసం ప్రవేశపెట్టిన అగ్నిపథ్కు నిరసనగా నేడు కొన్ని సంస్థలు భారత్ బంద్కు పిలుపునిచ్చాయి. దీంతో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్ (ఆర్పీఎఫ్), గవర్నమెంట్ రైల్వే పోలీసుల (జీఆర్పీ) అప్రమత్తమయ్యారు. రైల్వే స్టేషన్లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద బందోబస్త్ ఏర్పాటు చేశారు.
కేంద్ర ప్రభుత్వం త్రివిధ దళాల్లో చేపట్టనున్న నియామకాలను అగ్నిపథ్ స్కీము ద్వారానే చేపట్టనున్నట్టు ప్రకటించింది. దీంతో ఆర్మీ ఉద్యోగ అభ్యర్థులు దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్నారు. అగ్నిపథ్ని వాపస్ తీసుకోవాలని, తక్కువ వయస్సుకే ఆర్మీ అభ్యర్థులను పరిమితం చేస్తే తమ భవిష్యత్ ఆగమైతుందని ఇప్పటికే పలు రకాల పరీక్షలు ఎదుర్కొన్న అభ్యర్థులు అంటున్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీరును నిరసిస్తూ దేశ వ్యప్తంగా ఆందోళనలు చేస్తున్నారు. పలు రాష్ట్రాల్లో ఈ ఆందోళనలు, నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి. ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలతో పాటు తెలంగాణలో రైల్వే స్టేషన్లలో విధ్వంసం సృష్టించారు.
ఆందోళనకారుల తీరుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నా ఎక్కడా తగ్గడం లేదు. ఆందోళనలను మరింత విస్తృతం చేస్తున్నారు. అందులో భాగంగా నేడు దేశ వ్యాప్త బంద్కు ఆర్మీ ఉద్యోగ అభ్యర్థులు పిలుపునిచ్చారు. దీంతో పలు రాష్ట్రాలు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల వద్ద 144 సెక్షన్ విధించాయి. ప్రజలు, యువకులు, విద్యార్థులు గుమిగూడి కనిపించవద్దని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలుంటాయని ఆయా రాష్ట్రాల అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.