మొక్కలను పెంచడం ద్వారానే భవిష్యత్ తరాలకు స్వచ్చమైన గాలిని, ఆరోగ్యాన్ని అందించగలమని, మొక్కలను పెంచి పర్యావరణాన్ని కాపాడుకోవడం మనందరి బాద్యత అని, జిల్లా ఎస్పీ డాక్టర్ వై . సాయి శేఖర్ అన్నారు. ఈ రోజు నాగర్ కర్నూల్ జిల్లాలో 6వ విడత తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఆయన ఎంపీ రాములు, జిల్లా కలెక్టర్ శ్రీధర్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, జెడ్పి చైర్ పర్సన్ పద్మావతి తో కలిసి అచ్చంపేట్ రంగాపూర్ పరిధిలోని ఫారెస్ట్ భూమిలో మొక్కలను నాటి హరిత హారo కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 6వ విడత హరిత హారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని, 6వ విడత హరితహారం కార్యక్రమం సందర్భంగా జిల్లా లోని అన్ని పోలీస్ స్టేషన్ ల అవరణలలో , పోలీస్ శాఖకు సంబంధించిన భూమిలో మొక్కలు నాటతామని అన్నారు. మొక్కలు నాటేందుకు జిల్లా పోలీస్ శాఖ కు ఇచ్చిన లక్ష్యాన్ని పూర్తి చేస్తామని అన్నారు.
రోజు రోజుకు పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని తగించేందుకు ప్రతి ఒక్కరు ఒక మొక్కను నాటాలని, మొక్కలను నాటడమే కాకుండా సంరక్షణ బాధ్యతలు కూడా తీసుకోవాలని, భవిష్యత్ తరాలకు స్వచ్చమైన గాలిని అందించేందుకు మొక్కలను పెంచి పర్యావరణాన్ని పరి రక్షించాల్సిన బాధ్యత మనందరి పై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామాల పెద్దలు, వార్డు మెంబర్లు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, జిల్లా ప్రజలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.