నల్లగొండ పట్టణంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళా ప్రాంగణం వద్ద జరిగిన హత్య కేసును ఛేదించి నిందితుడిని రిమాండుకు తరలిస్తున్నట్లు నల్లగొండ డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. బుధవారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో సిఐ నిగిడాల సురేష్ తో కలిసి హత్య కేసు వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు.
డిఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 20న నల్లగొండ పట్టణానికి చెందిన చింతల గోపి తన కుమారుడు రిత్విక్ పుట్టు వెంట్రుకల ఫంక్షన్ కు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నందిగామ నుండి అతనికి పిల్లనిచ్చిన మామ అయిన వంటిపులి వెంకటేశ్వర్లు, నిందితుని బావమరుది ప్రకాష్ లు వచ్చారని డిఎస్పీ తెలిపారు.
ఫంక్షన్ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత బావమరిది తిరిగి నందిగామకు వెళ్లిపోగా నిందితుని మామ, హతుడు వెంకటేశ్వర్లు తన కూతురును పుట్టింటికి తీసుకెళ్లడం కోసం ఇక్కడే ఉండిపోయారని తెలిపారు. 21న నిందితుడు గోపి, హతుడు వెంకటేశ్వర్లు మామ, అల్లుడు ఇద్దరు కలిసి ఇంట్లోనే మద్యం సేవించారని అయితే ఇదే సమయంలో హతుడు వెంకటేశ్వర్లు అల్లుడైన నిందితుడు గోపి తరచూ తన భార్య వెంకటలక్ష్మిని ఎందుకు కొడుతున్నావని, శారీరకంగా ఎందుకు హింసిస్తున్నావని ప్రశ్నించగా అల్లుడు ఆవేశంతో ఇంట్లో ఉన్న రోకలి బండతో మామ వెంకటేశ్వర్లు పై దాడికి ప్రయత్నించగా వెంకటలక్ష్మి అడ్డుకున్నదని డిఎస్పీ వివరించారు.
ఇదే సమయంలో పక్కనే ఉన్న రోలుతో మామ తల మీద బలంగా బాదినట్లు తెలిపారు. వెంటనే చుట్టు పక్కల వారితో కలిసి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా అప్పటికే వెంకటేశ్వర్లు మృతి చెందినట్లు డిఎస్పీ వివరించారు. మృతుని కుమారుడు ప్రకాష్ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న వన్ టౌన్ పోలీసులు విచారణ చేసి నిందితుడిని అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించినట్లు డిఎస్పీ తెలిపారు.
కేసు విచారణలో సమర్థవంతంగా విచారణ చేసి కేవలం మూడు రోజుల వ్యవధిలో నిందితుడిని అరెస్ట్ చేసిన వన్ టౌన్ సిఐ నిగిడాల సురేష్, వన్ టౌన్ క్రైమ్ పార్టీ సిబ్బంది రాము, రాజు, షకీల్, శ్రీనివాస్, రైటర్ శ్రీనివాస్ తదితరులను డిఎస్పీ అభినందించారు.