తీర్పును అమలు చేయని రాష్ట్ర ప్రభుత్వంపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్.రమేష్ కుమార్ కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర హైకోర్టు తనను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా(ఎస్ఈసీ) నియమించాలని తీర్పు ఇచ్చినా అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడుతోందని పిటిషన్లో ప్రస్తావించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి, ఏపీ ఎన్నికల సంఘం కార్యదర్శిలను ఈ కేసులో ప్రతివాదులుగా చేర్చారు. డాక్టర్ ఎన్ రమేష్ కుమార్ తరపున లాయర్ అశ్వనీదత్ కుమార్ ఈ పిటిషన్ దాఖలు చేయగా హైకోర్టు విచారణకు స్వీకరించింది.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలాన్ని కుదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్సును, రిటైర్డ్ జస్టిస్ కనగరాజ్ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమిస్తూ ఇచ్చిన జీవోలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ తీర్పును సవాల్ చేస్తూ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఏపీ ఎన్నికల సంఘం విడివిడిగా పిటిషన్లు దాఖలు చేశాయి.
అయితే సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. కేసు విచారణను వాయిదా వేసింది. సుప్రీంకోర్టులో ఈ కేసుపై విచారణ నడుస్తుండగానే ఏపీ హైకోర్టులో రమేష్ కుమార్ కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు.