పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా విజయనగరం కోట జంక్షన్ వద్ద “పోలీసు బ్యాండ్ షో”ను జిల్లా ఎస్పీ ఎం.దీపిక ప్రారంభించారు. విజయనగరం జిల్లాలో నిర్వహిస్తున్న పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా విజయనగరం పట్టణం కోట జంక్షన్ వద్ద వద్ద ఆర్మ్ రిజర్వు పోలీసుల ఆధ్వర్యంలో “పోలీసు బ్యాండ్ డిస్ ప్లే” ను ప్రదర్శించారు.
ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ఎం. దీపిక ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం దీపిక మాట్లాడుతూ – శాంతిభద్రతల పరిరక్షణకు అంకితమైన పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలను కోల్పోయి అమరులయ్యారు. ఉమ్మడి జిల్లా ఐదుగురు పోలీసులు తమ ప్రాణాలను కోల్పోయారని అన్నారు. వారి త్యాగాలను స్మరించుకుంటూ జిల్లాలో పలు కార్యక్రమాలను చేపట్టామన్నారు.
పోలీసుశాఖ నిర్వహించే విధులు, క్రమశిక్షణలో పోలీసు బ్యాండు కూడా భాగమేనన్నారు. పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా పోలీసు బ్యాండు పని తీరు, నైపుణ్యాన్ని ప్రజలకు తెలియపర్చేందుకు ‘బ్యాండ్ షో’ను నిర్వహించామన్నారు. ముఖ్య వ్యక్తుల గౌరవార్ధం పోలీసులు చేసే బ్యాండు ప్రక్రియకు ఒక విశిష్టమైన స్థానముందని, రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులు, గవర్నరు వంటి ముఖ్యమైన వ్యక్తులు జిల్లాకు వచ్చినపుడు వారి గౌరవార్థం బ్యాండు, బిగిల్ తో వారిని గౌరవించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ అన్నారు.
అన్ని రంగాల్లోను పోలీసులు తమ ప్రతిభను చూపుతూ, అత్యుత్తమ సంగీతాన్ని అందించి, ఆహ్వానితులను రంజింపజేసారు.పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో పోలీసు అధికారులు,సిబ్బంది, పోలీసు పిల్లలు, స్కూలు,కళాశాల విద్యార్థులకు మూడు కేటగిరీలుగా విభజించి, వ్యాస రచన, వక్తృత్వ పోటీలను వేరు వేరుగా నిర్వహించగా, విజేతలుగా నిలిచిన వారికి జిల్లా ఎస్పీ ఎం. దీపిక ప్రోత్సాహక నగదు బహుమతులను అందజేసారు.
వ్యాస రచన పోటీల్లో పోలీసు ఉద్యోగుల విభాగంలో రాజాం పీఎస్ కు చెందిన సిహెచ్.తేజ, స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ ఎం.గౌరేశ్వర రావు, ఎఆర్ మహిళా పిసి పి.స్వాతి, స్కూల్స్ విభాగంలో సీహెచ్.లక్ష్మి, జే.ప్రశాంతి, కే.సాయి ప్రసన్న, పోలీసు చిల్డ్రన్ విభాగంలో ఎస్.ఓంకార్, పి రాజారాం, ఆర్.పూజిత విజేతలుగా నిలిచారు.
పోలీసు బ్యాండ్ మాస్టర్ కుమార్ రత్నం ఆధ్వర్యంలో ఆర్మ్డ్ రిజర్వు పోలీసులు అమరవీరులను స్మరించుకొంటూ, దేశభక్తిని చాటే చక్కని పాటలను వీనుల విందుగా వాయించి, ఆహ్వానితులను ఆహ్లాదపర్చారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీలు టి.త్రినాధ్, ఆర్.శ్రీనివాసరావు, ఎల్.మోహనరావు, ఎల్. శేషాద్రి, పలువురు సిఐలు, ఆర్ఐలు ఎస్ఐలు, మహిళా పోలీసులు, పోలీసు సిబ్బంది, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.