దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని షాహీన్ బాగ్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అక్రమ ఆక్రమణల పేరుతో ఇళ్లు కూలగొట్టడానికి వ్యతిరేకిస్తూ అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ అక్కడికి చేరుకోవడంతో ఉద్రికత్త మరింత పెరిగింది. ఇందుకోసం భారీ ఎత్తున పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా షాహీన్బాగ్లో భారీ సంఖ్యలో బలగాలను మోహరించారు. కూల్చివేతలు సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది.
అయితే స్థానికుల వ్యతిరేకతతో ఇప్పటి వరకు పనులు ప్రారంభం కాలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ కూడా తన మద్దతుదారులతో కలిసి షాహీన్ బాగ్ చేరుకున్నారు. ‘‘ఇప్పుడు నేను వచ్చాను, ఇప్పుడు బుల్డోజర్ ఎక్కడికి వెళుతుందో చూద్దాం’’ అని అమానతుల్లా ఖాన్ అన్నారు.
కార్పొరేషన్ చర్యను రాజకీయ పార్టీలతో పాటు స్థానిక ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రజల నిరసన దృష్ట్యా సదరన్ కార్పొరేషన్ పోలీసులను భారీగా మోహరించింది. షాహీన్బాగ్లో పోలీసులు ఆందోళనకారులను తొలగించే పనిలో నిమగ్నమయ్యారు.
నిరసన తెలుపుతున్న మహిళలను అక్కడి నుంచి తొలగించేందుకు మహిళా పోలీసులు చర్యలు చేపట్టారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య బుల్డోజర్లతో ఆక్రమణలను తొలగించే పనిలో ఉన్నారు. బుల్డోజర్ చర్యపై ఆ ప్రాంతానికి చెందిన ప్రజలు, రాజకీయ పార్టీలు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
పేదలపై బుల్డోజర్లను నడిపేందుకు అనుమతించబోమని నిరసన తెలిపారు. ఈ బుల్ డోజర్ పేరుతో ఢిల్లీ ప్రజలను సర్వనాశనం చేసేందుకు అధికారులు ప్లాన్ వేశారని అంటున్నారు. దేశం చట్టం ద్వారా నడుస్తుంది, బుల్డోజర్ల ద్వారా కాదు. ఆక్రమణను తొలగించాలంటే ముందుగా ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు ఆదేశ్ గుప్తా ఇంటి నుంచి తొలగించండి అంటూ నినాదాలు చేశారు.
తుగ్లకాబాద్, సంగం విహార్, న్యూ ఫ్రెండ్స్ కాలనీ లేదా షాహీన్ బాగ్ ఇలా అన్ని చోట్లా ఆక్రమణలు తొలగిస్తామని ఎస్డిఎంసి ఛైర్మన్ రాజ్పాల్ అన్నారు.