మార్చి14నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. వైసీపీ సర్కార్ నాలుగేళ్ల పాలన పూర్తి చేసుకోబోతోంది. అలాగే మరో రెండు నెలల్లో ఎన్నికల ఏడాదిలోకి ప్రవేశించబోతోంది. ఎన్నికల ఏడాది ఎలాగో పూర్తిస్ధాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం కూడా ఉండదు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కీలకంగా మారాయి. 14వ తేదీన గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమవుతాయి. గవర్నర్ ప్రసంగం తర్వాత బీఏసీ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ పని దినాలను నిర్ణయిస్తారు.
కనీసం పది రోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఈ ఏడాది వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం ఇప్పటికే వివిధ శాఖల నుంచి ప్రతిపాదనలు తెప్పించుకున్న ప్రభుత్వం వాటితో బడ్జెట్ పద్దు సిద్దం చేస్తోంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు అనుమతిని ఇవ్వాలని కోరుతూ గవర్నర్ కు ప్రతిపాదనలు పంపగా నూతన గవర్నర్ అబ్దుల్ నజీర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
శుక్రవారం ఉదయం అబ్దుల్ నజీర్ గవర్నర్ గా బాధ్యతలను స్వీకరించిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సంక్షేమ పథకాలకు వైకాపా ప్రభుత్వం పెద్ద పీట వేసే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇందులోనే మూడు రాజధానుల బిల్లును మరోసారి ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్దమవుతోందన్న సంకేతాలు వస్తున్నాయి. బడ్జెట్ తో పాటు పలు కీలక బిల్లుల్ని ఆమోదింపచేసుకునేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకుంటోంది.