పీకేగా పేరుగాంచిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సొంతంగా ఏదైనా పార్టీ పెట్టబోతున్నారా? జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే పీకే కొత్త రాజకీయ పార్టీ పెట్టే దిశగానే ఆలోచనలు చేస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్లో చేరి ఆ పార్టీ కి పునర్వైభవం తీసుకువస్తానని చెప్పిన పీకే ఆ మిషన్ను మధ్యలోనే వదిలిపెట్టి పోయారు. కాంగ్రెస్ పార్టీకి మరింత సమర్ధుడైన నాయకుడు అవసరం అంటూ ఆయన ఆ పార్టీని ఎగతాళి చేశారు.
ఇప్పుడు ఆయన తన రాజకీయ భవిష్యత్తును వెతుక్కుంటూ మళ్లీ రాజకీయంగా కొత్త డ్రామా మొదలు పెట్టబోతున్నారని అంటున్నారు. ప్రశాంత్ కిషోర్ సోమవారం తన కొత్త ‘జన సూరజ్’ ప్రచారాన్ని ప్రారంభించారు. బీహార్ నుంచి ప్రారంభిస్తానని దీన్ని ప్రారంభిస్తున్నట్లు ఆయన చెప్పారు.
ప్రశాంత్ కిషోర్ ట్వీట్ ద్వారా తన కొత్త ప్రచారాన్ని ప్రకటించారు. “ప్రజాస్వామ్యంలో అర్ధవంతమైన భాగస్వామిగా ఉండాలనే నా తపన మరియు ప్రజానుకూల విధానాలను రూపొందించడంలో సహాయపడటానికి గత 10 సంవత్సరాలుగా నేను చేస్తున్న పనులను ప్రజలకు చెబుతా” అని ఆయన వెల్లడించారు.
‘‘ఇప్పుడు నేను కొత్త శకాన్ని ప్రారంభించబోతున్నాను. ఇప్పుడు ‘రియల్ మాస్టర్స్’ వద్దకు వెళ్లవలసిన సమయం ఆసన్నమైంది. అంటే ప్రజలు వద్దకు వెళతాను. వారి సమస్యలను అర్ధం చేసుకోవడానికి వీలుగా ఇది ఉంటుంది. జన సూరజ్ ప్రచారం బీహార్ నుండి ప్రారంభం చేస్తున్నాను’’ అని ఆయన చెప్పారు.
గత కొన్ని రోజులుగా ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్లోకి వెళ్లనున్నారనే చర్చ సాగింది. 2024 లోక్సభ ఎన్నికలలో కాంగ్రెస్ మెరుగైన పనితీరుకు సంబంధించి పార్టీ పునరుజ్జీవన ప్రజెంటేషన్ను కూడా సమర్పించారు, అయినప్పటికీ కాంగ్రెస్ కు ఆయనకు మధ్య చర్చలు ఫలించలేదు. చివరి రౌండ్లో ఆయన కాంగ్రెస్కు దూరమయ్యాడు.
కాంగ్రెస్తో చర్చలు చెడిపోయినప్పటి నుంచి ప్రశాంత్ కిషోర్ నిరంతరం హెడ్లైన్స్లో ఉంటున్నారు. సోమవారం ఉదయం పైన పేర్కొన్న ట్వీట్ చేయడం ద్వారా, ప్రజాస్వామ్యంలో అర్ధవంతమైన పాత్రను పోషించడానికి, ప్రజా స్నేహపూర్వక విధానాలను రూపొందించడానికి తన కొత్త ప్రయత్నాలకు స్పష్టమైన సూచన ఇచ్చారు.
పీకే సొంతంగా పార్టీని ఏర్పాటు చేస్తారని, దానికి ‘జన సూరజ్’ అని పేరు పెట్టనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆయన సూచనలను బట్టి చూస్తే అదే కనిపిస్తోంది. బీహార్ నుంచి ప్రారంభమైన పీకే పాట్నా చేరుకున్నారు. పాట్నాలోని ఒక విలాసవంతమైన ఏరియాలో ఆయన కార్యాలయం సిద్ధంగా ఉందని చెబుతున్నారు.