ప్రాజెక్టులకు సంబంధించి భూ సేకరణ ప్రక్రియ ను వేగవంతం చేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. ఐడిఓసి లోని సమావేశ మందిరంలో అధికారులతో భూ సేకరణ పురోగతిపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వివిధ ప్రాజెక్టులు జిల్లాలో చేపట్టినట్లు, వాటి భూ సేకరణకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
నేషనల్ హైవే ద్వారా ఖమ్మం-దేవరపల్లి, నాగపూర్-అమరావతి, కోదాడ-ఖమ్మం, ఖమ్మం-కురవి రహదారి విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నట్లు ఆయన అన్నారు. రహదారి విస్తరణ పనులకు ఆటంకాలు కలగకుండా భూ సేకరణ ముందస్తుగా పూర్తిచేయాలన్నారు. కొండపల్లి-కాజీపేట 3వ రైల్వే లైన్ ఏర్పాటుకు భూ సేకరణ పూర్తి చేయాలన్నారు. సీతారామ ఎత్తిపోతల పథకానికి 6 మండలాలకు చెందిన 18 గ్రామాల నుండి భూసేకరణ వివిధ దశల్లో ఉన్నట్లు, త్వరితగతిన పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు.
లంకపల్లి ఆర్ఎన్ఆర్ భూసేకరణ కు చర్యలు తీసుకోవాలన్నారు. సర్వే ప్రక్రియ ఇంకనూ పూర్తికాని ప్రాజెక్టుల విషయమై బృందాలను పంపి పూర్తి చేయాలన్నారు. కట్టడాలు, చెట్లు తదితరాల మూల్యాంకనం చేసి బాధితులకు నష్టపరిహారం అందించాలన్నారు. సీఏ భూముల అప్పగింత ప్రక్రియ వేగం చేయాలన్నారు. తహశీల్దార్లు తమ పరిధిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను, రైస్ మిల్లులను తనిఖీ చేయాలని, రైస్ మిల్లులో ధాన్యం అన్లోడ్ అయ్యేలా చూడాలని అన్నారు.
తహశీల్దార్లు రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటుచేయాలని కలెక్టర్ తెలిపారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, ఇర్రిగేషన్ సిఇ శంకర్ నాయక్, ఆర్డీవోలు రవీంద్రనాథ్, సూర్యనారాయణ, ఎస్డిసి దశరథం, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.