శ్రీవారి దర్శనం విషయంలో సామాన్య భక్తులకు మరింత ప్రాధాన్యత పెంచేందుకు వీలుగా శ్రీవాణి దర్శన టికెట్లను టిటిడి రోజుకు 1,000కి పరిమితం చేసింది. ఇందులో ఆన్లైన్లో 750, ఆఫ్ లైన్ లో 250 టికెట్లను జారీ చేస్తారు. ఇప్పటికే టిటిడి 500 టికెట్లను ఆన్లైన్లో విడుదల చేయగా, అదనంగా జనవరి 11న మరో 250 టికెట్లు విడుదల చేయనుంది.
మాధవం విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల కేటాయింపును టిటిడి రద్దు చేసింది. ఇక నుంచి శ్రీవాణి దాతలకు విమానాశ్రయంలో కరెంట్ బుకింగ్ కౌంటర్ను అందుబాటులో ఉంచారు. బోర్డింగ్ పాస్ ద్వారా తిరుపతి ఎయిర్పోర్ట్ కౌంటర్లో మాత్రమే ఆఫ్లైన్ టిక్కెట్లు జారీ చేస్తారు. శ్రీవాణి దాతలు బ్రేక్ దర్శనం టికెట్కి బోర్డింగ్ పాస్ను జతచేయాలి.
టికెట్ పై ఎయిర్లైన్ రిఫరెన్స్తో కూడిన పిఏన్ అర్ నంబర్ను కూడా నమోదు చేయించాలి. వైకుంఠం క్యూ కాంప్లెక్సులోని సిబ్బంది బ్రేక్ దర్శన టిక్కెట్తో పాటు బోర్డింగ్ పాసును తనిఖీ చేసి దర్శనానికి అనుమతిస్తారు.
తిరుప్పావడ సేవ పునఃప్రారంభం.
తిరుమల శ్రీవారి ఆలయంలో తిరుప్పావడ ఆర్జిత సేవ జనవరి 12 నుంచి పునఃప్రారంభం కానుంది. ఇందుకోసం యాత్రికులు తిరుమలలోని సిఆర్ఓ కౌంటర్లో నమోదు చేసుకోవాలి. వీరికి జనవరి 11న సాయంత్రం 5 గంటలకు ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా 25 టికెట్లు జారీ చేస్తారు.భక్తులు పై అంశాలను గమనించవలసిందిగా కోరడమైనది.