ఆల వెంకటేశ్వర్ రెడ్డి హటావో, దేవరకద్ర బచావో అని దేవరకద్ర నియోజకవర్గ ప్రజలకు బీసీ పొలిటికల్ జెఎసి రాష్ట్ర చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రాచాల మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు పూర్తి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పది సంవత్సారాలు పూర్తయినట్లు ప్రజలను మభ్యపెట్టి ఏదో సాధించినట్లు దశాబ్ది ఉత్సవాలు నిర్వహించి ప్రజాధనం వృధా చేసిందని విమర్శించారు.
దేవరకద్ర నియోజకవర్గంలో ఇప్పటివరకు ఒక్క డిగ్రీ కళాశాల, 100 పడకల ఆసుపత్రి కూడా మంజూరు చేయించలేకపోవటం ఎమ్మెల్యే చేతకానితనానికి నిదర్శనమన్నారు. డిగ్రీ కళాశాల, ఆసుపత్రి వెంటనే మంజూరు చేస్తామని హామీ ఇచ్చి ఏడాది దాటినా ఇంతవరకు అమలు కాలేదన్నారు. గడిచిన తొమ్మిదేళ్ళలో కానాయపల్లి శంకర సముద్రం భూ నిర్వాసితుల సమస్యలు గానీ, ఊక చెట్టు వాగుపై బ్రిడ్జి నిర్మాణం, రోడ్ల విస్తరణలు ,మినీ స్టేడియం, కొత్త మండలాల్లో జూనియర్ కళాశాలల ఏర్పాటు వంటి తదితర సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించారని ఆరోపించారు.
కర్వెన ప్రాజెక్టు కాంట్రాక్టు,ఇసుక, మట్టిదందా, భూకబ్జాలు తప్ప నియోజకవర్గానికి చేసిందేమీలేదన్నారు. జర్నలిస్టులకు ఇచ్చిన హామీ ప్రకారం డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.రెండు సార్లు గెలిచి అభివృద్ధి చేయని ఎమ్మెల్యేను ఇంటికి సాగనంపాల్సిన సమయం ఆసన్నమైందని, ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఎన్నికల్లో ఓడించి తీరతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ పొలిటికల్ జెఎసి నాయకులు అంజన్న యాదవ్, మహిందర్ నాయుడు, శేఖర్ గౌడ్, రవి తదితరులు పాల్గొన్నారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్