కామారెడ్డి నియోజకవర్గంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గెలుపు ఖరారైందని టీపీసీసీ జనరల్ సెక్రెటరీ పున్న కైలాస్ నేత అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కైలాస్ నేత మాట్లాడుతూ.. కామారెడ్డి ఎన్నిక తెలంగాణ భవిష్యత్తును నిర్ణయించేదన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో తాము తిరుగుతుంటే రేవంత్ రెడ్డికే ఓటు వేస్తామని ప్రజలు చెప్తున్నారన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే సీఎం కేసీఆర్ స్పందించలేదన్నారు. మాటలతో వంచించే దుర్మార్గపు పాలనకు అంతం పలకాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో రైతులకు లాభం జరగలేదని, 9 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. రెండుసార్లు అధికారం ఇస్తే అప్పుల తెలంగాణను చేశారన్నారు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చేయలేదని, పరీక్ష పత్రాలు లీకేజీ చేస్తూ నిరుద్యోగుల చావుకు కారణమయ్యారన్నారు. ధరణి పేరుతో దోచుకున్నారన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 8 స్థానాలు కాంగ్రెస్ కైవసం కాబోతున్నాయన్నారు. 50 వేల మెజారిటీతో రేవంత్ రెడ్డి గెలుపు ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో టీపీసీసీ సెక్రటరీ రజాక్, శివకుమార్, సతీష్ కుమార్, ప్రసాద్ గౌడ్, శివశంకర్ గౌడ్, నిఖిల్ చారి తదితరులు పాల్గొన్నారు
సత్యం న్యూస్, కామారెడ్డి