ఇటీవల కర్నూలులో నారా లోకేష్ యువగళం పాదయాత్ర సాగింది. ఈ సందర్భంగా ప్రకాష్ నగర్ 49 వ వార్డుకి చెందిన రాము కుటుంబంతో కలిసి లోకేష్ కి హారతి ఇచ్చి స్వాగతం పలికారు. లోకేష్కి స్వాగతం పలికారని కక్ష కట్టిన వైసీపీ కార్పొరేటర్ కృష్ణ కాంత్..40 ఏళ్లుగా రాము ఉపాధి పొందుతోన్న కూరగాయల దుకాణాన్ని నిర్దాక్షిణ్యంగా కూల్చివేయించాడు. కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా, పక్కషాపులేవీ ముట్టుకోకుండా తన షాపు ఒక్కటే ఎందుకు కూల్చుతున్నారని రాము మున్సిపల్ అధికారులను నిలదీస్తే…వైసీపీ కార్పొరేటర్ కృష్ణకాంత్ ఆదేశాలతో కూల్చేశామని వారు చెప్పారు.
నలభై ఏళ్లుగా తన కుటుంబానికి తిండిపెట్టే ఉపాధి కేంద్రమైన కూరగాయల దుకాణం కళ్ల ముందే వైసీపీ నేతలు కూలగొట్టడంతో రాము గుండెలు అవిసేలా రోదించాడు. సమాచారం తెలుసుకున్న టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. వైకాపా కాలకేయులు కూల్చలేని విధంగా సొంత స్థలంలో రాముకి శాశ్వతంగా ఉండేలా కూరగాయల దుకాణం నిర్మించేందుకు, కూరగాయలు కొని వ్యాపారం చేసేందుకు పెట్టుబడిగా సాయం అందించాలని నిర్ణయించారు. జగన్ కక్షతో పడగొడితే…తాను ప్రేమతో నిలబెడతానని, మరోసారి బాధితులకి అండగా నిలవడం ద్వారా లోకేష్ చాటిచెప్పారు. రాముకి అండగా తెలుగుదేశం ఉందని భరోసా ఇచ్చారు.