రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏప్రిల్ 30 వరకు సామూహిక కార్యక్రమాల నిర్వహణ పై ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష ఒక ప్రకటనలో తెలిపారు.
రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్న దృష్ట్యా, కేసులను నివారించడానికి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కు ధరించడాన్ని ఖచ్చితం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం హోలీ, ఉగాది, రంజాన్, గుడ్ ఫ్రైడే ,శ్రీరామనవమి వంటి పండుగల సందర్భంగా ఎలాంటి వేడుకలు నిర్వహించవద్దని ప్రభుత్వం ఆదేశించిందని తెలిపారు. ప్రజలు గుమిగూడడం పై ప్రభుత్వం నిషేధం విధిస్తూ ఏప్రిల్ 30 వరకు ర్యాలీలు, ఉత్సవాలు చేయరాదని తెలిపిందని పేర్కొన్నారు.
బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, మాస్కులు ధరించని వారిపై విపత్తు నిర్వహణ చట్టం, IPC సెక్షన్ల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, జరిమానాలు విధించడం జరుగుతుందని కలెక్టర్ వెల్లడించారు. అందువల్ల ప్రజలందరూ కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించి జిల్లా యంత్రాంగానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి