విశాఖ లోని ఆర్ కే బీచ్ లో గల్లంతయిన వివాహిత ఆచూకీ తెలిసింది. …. అయితే అందరూ ఊహించినట్లు ఆమె ప్రమాదానికి లోను కాలేదు….. ప్రియుడితో పరారైంది. ఊహించని ఈ ట్విస్టుతో పోలీసులే షాకయ్యారు. భర్తతో కలిసి ఆర్ కె బీచ్ కి వచ్చిన సాయి ప్రియ సముద్రంలో గల్లంతు అయిందని భావించిన పోలీసులు హెలికాప్టర్ తో వెతికి నానా తిప్పలు పడ్డారు.
అయితే సాయి ప్రియ తన లవర్ తో కలిసి పారిపోయి నెల్లూరు చేరింది. పెళ్లి రోజు కావడంతో భర్తతో కలిసి ఆర్ కె బీచ్ కి విహారానికి ఆమె వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ భర్త ఫోన్ మాట్లాడుతున్న సమయంలో ఆమె కనిపించకుండా పోయింది. భార్య గల్లంతు అయ్యిందని భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో రంగంలో దిగిన పోలీసులు గజ ఈతగాళ్లతో వెతుకులాడారు. అయినా కనిపించకపోవడంతో హెలికాప్టర్ రప్పించారు. అయినా సాయి ప్రియ దొరకలేదు. తీరా తెల్లారే సరికి ఆమె నెల్లూరులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
గాలింపు కోసం రూ. కోటి ఖర్చు
సాయి ప్రియ గాలింపు కోసం అధికారులు సుమారు రూ. కోటి ఖర్చు చేశారు. ఈ విషయమై విశాఖ నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్ మాట్లాడుతూ.. వివాహిత ఆచూకీ కోసం ప్రభుత్వ శాఖలన్నీ తీవ్రంగా శ్రమించాయని తెలిపారు. ప్రస్తుతం సాయి ప్రియ నెల్లూరులో ఉన్నట్లు సమాచారం వచ్చిందని, ఆమెను నెల్లూరు నుంచి విశాఖకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు.
అసలు కథ ఏమిటంటే..
శ్రీనివాస్తో వివాహానికి కంటే ముందు.. సాయి ప్రియ నెల్లూరుకి చెందిన రవి అనే వ్యక్తితో ప్రేమలో ఉంది. వివాహానికి ముందు రెండు సార్లు రవితో కలిసి సాయి ప్రియ వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు శ్రీనివాస్ను 2020 జూలై 25న పెళ్లి చేసుకుంది.
శ్రీనివాస్ హైదరాబాద్లోని ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తుండడంతో ఈ జంట హైదరాబాద్లో కాపురం పెట్టింది. అయితే పెళ్లి తర్వాత కూడా సాయి పల్లవి రవితో ప్రేమ వ్యవహారాన్ని కొనసాగించింది. నాలుగు నెలల క్రితం కంప్యూటర్ కోర్సు చేయాలంటూ సాయి ప్రియ హైదరాబాద్ నుంచి విశాఖ వచ్చింది. ఇదే సమయంలో సెకండ్ మ్యారేజ్ డే అని శ్రీనివాస్ ఈ నెల 25న హైదరాబాద్ నుంచి విశాఖ వచ్చాడు.
అదే రోజు సాయంత్రం 5.30 కి భర్త తో కలిసి బీచ్కి వెళ్లిన సాయి ప్రియ, అంతకు ముందే ఆ సమాచారాన్ని ప్రియుడు రవికి చేరవేసింది. శ్రీనివాస్ ఏమరపాటుగా ఉన్న సమయంలో రవితో కలిసి సాయి ప్రియ అక్కడి నుంచి పారిపోయింది. ఇది తెలియని శ్రీనివాస్ తన భార్య తప్పిపోయిందని తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఏకంగా హెలికాప్టర్లతో గాలింపు చర్యలు చేపట్టారు.