అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉక్కపోతకు గురి అవుతున్నారా? నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి తాజాగా చేసిన సంచలన ఆరోపణలు చూస్తుంటే అధికార వైసీపీ తన సొంత ఎమ్మెల్యేలనే నమ్ముతున్నట్లు కనిపించడం లేదు. అందరిని అనుమానంగా చూస్తుండటంతో వైసీపీ ఎమ్మెల్యేలే తీవ్రమైన వత్తిడిలో ఉన్నారు. తనపై ఇంటెలిజెన్స్ అధికారులు నిఘా పెట్టారని కోటంరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. తన ఫోన్ 3 నెలల నుంచి ట్యాప్ చేస్తున్నారని, ఈ విషయం తనకు ముందే తెలుసునని ఆయన అన్నారు.
రహస్యాలు మాట్లాడుకునేందుకు తనకు వేరే ఫోన్, 12 సిమ్లు ఉన్నాయని కోటంరెడ్డి వ్యాఖ్యానించారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేల ఫోన్ లను ఇలా ట్యాప్ చేయడం సంచలనం కలిగిస్తున్నది. చాలా మంది ఎమ్మెల్యేలపై ఇదే విధంగా అధికార పార్టీ నిఘా పెట్టినట్లు కనిపిస్తున్నది. ఫేస్ టైమర్, టెలిగ్రాం కాల్స్ని మీ పెగాసస్ రికార్డు చేయలేదు.. అధికార పార్టీ ఎమ్మెల్యేపై ముగ్గురు అధికారులతో నిఘా అవసరమా? నిఘా కోసం నా నియోజకవర్గంలో ఒక ఐపీఎస్ అధికారిని పెట్టుకోండి.. క్రికెట్ బెట్టింగ్ కేసులప్పుడు కూడా అప్పటి ఎస్పీ నాపై నిఘా పెట్టారు అని కోటంరెడ్డి వ్యాఖ్యలు చేశారు.